న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో భారతీ సిమెంట్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ జప్తు చేసిన భారతీ సిమెంట్స్ ఎఫ్డీలను విడుదల చేయాలంటూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. భారతీ సిమెంట్స్కు చెందిన రూ.150 కోట్ల ఎఫ్డీ మొత్తాన్ని విడుదల చేయాలని గతంలో ఈడీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. భారతీ సిమెంట్స్ ఎఫ్డీల స్థానంలో బ్యాంకు గ్యారంటీలు తీసుకొని, ఎఫ్డీలను విడుదల చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది.
అయితే హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా నేతృత్వంలోని ధర్మాసనం ఈడీ వాదనలతో ఏకీభవించింది. గతంలో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. బ్యాంకు గ్యారంటీలు తీసుకున్న తర్వాత కూడా ఈడీ భారతీ సిమెంట్స్ ఎఫ్డీలను జప్తు చేసిందని ప్రతివాదుల తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టు దృష్టికి తెచ్చారు.
కాగా, కనీసం తన ఎఫ్డీలపైన వచ్చిన వడ్డీనైనా విడుదల చేయాలని భారతీ సిమెంట్స్ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను కూడా సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఎఫ్డీలు విడుదల చేయాలన్న హైకోర్టు తీర్పునే పునఃపరిశీలించాలని సూచించినప్పుడు, జప్తు చేసిన దానికి వడ్డీ ఎలా వస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లపై విచారణ ముగిసిందని, ఇంకా అభ్యంతరాలుంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.