న్యూఢిల్లీ: నోయిడాలో అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల బిల్డింగ్లను కూల్చివేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. రియల్ ఎస్టేట్ కంపెనీ సూపర్టెక్.. నోయిడాలో రెండు 40 అంతస్తుల నిర్మాణాలను చేపట్టింది. అయితే నోయిడా అధికారులు, బిల్డర్లు కుమ్మక్కై ఆ బిల్డింగ్లను నిర్మించినట్లు కోర్టు చెప్పింది. నోయిడాలోని ఎమరాల్డ్ కోర్ట్లో సూపర్టెక్ కంపెనీ ఆ బిల్డింగ్లను నిర్మించింది. వాటిల్లో వెయ్యి ఫ్లాట్లు ఉన్నాయి. అన్నీ రూల్స్ను అతిక్రమించి ఆ ట్విన్ టవర్స్ను నిర్మించినట్లు సుప్రీం పేర్కొన్నది. అయితే స్వంత ఖర్చుతో మూడు నెలల్లోగా ఆ రెండు బిల్డింగ్లను సూపర్టెక్ కంపెనీయే నేలమట్టం చేయాలని ఇవాళ సుప్రీం తన తీర్పులో ఆదేశించింది.
గతంలో ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ట్విన్ టవర్స్లో ఫ్లాట్లు కొన్ని ప్రతి ఒక్కరికీ ఆ డబ్బును రెండు నెలల్లోగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఏడాదికి 12 శాతం వడ్డీతో ఆ మొత్తాన్ని ఇవ్వాలని కోర్టు పేర్కొన్నది. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్కు కూడా రెండు కోట్లు చెల్లించాలని బిల్డర్లకు కోర్టు ఆదేశించింది. యూపీ అపార్ట్మెంట్ యాక్ట్ను ఉల్లంఘించినట్లు కోర్టు తన తీర్పులో వెల్లడించింది. కామన్ ఏరియాలో అక్రమంగా ట్విన్ టవర్స్ నిర్మించినట్లు కోర్టు చెప్పింది.