నాగర్ కర్నూల్ : అచ్చంపేట అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని టీఆర్ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. అచ్చంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించడానికి వచ్చిన ఎన్నారై బృందం సభ్యులు సత్య చిలుముల, మల్లేష్ పప్పులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజును కలిశారు. ఎమ్మెల్యే సూచన మేరకు ఎమ్మల్సీ నారాయణ రెడ్డితో కలిసి వివిధ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. మంత్రి కేటీఆర్ అచ్చంపేట అభివృద్ధికి కృషి చేస్తానని గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అచ్చంపేట అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజలంతా విజ్ఞతతో ఓటేసి 20 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.