న్యూఢిల్లీ: ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం బుక్లో న్యాయవ్యవస్థపై వివాదాస్పద పాఠ్యాంశం ఉన్న కేసులో ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆ బుక్ను బ్యాన్ చేస్తూ ఇవాళ సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. న్యాయవ్యవస్థలో అవినీతి అన్న అంశంతో ఉన్న ఆ బుక్కు చెందిన కాపీలను సీజ్ చేయాలని కూడా సుప్రీం ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొన్నది. సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, విపుల్ ఎం పంచోలీతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఆదేశాలు ఇచ్చింది. చాలా లోతైన కుట్ర జరిగినట్లు కోర్టు చెప్పింది.
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకాన్ని ప్రచురించిన బాధ్యతాయుత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొన్నది. ఈ అంశంలో చాలా లోతైన దర్యాప్తు చేపట్టాలని భావిస్తున్నామని, దీనికి కారణమైన వారిని గుర్తించాలని, వాళ్లు ఎవరో తాము తేల్చుతామని, నిశితంగా ఈ కేసును పరిశీలిస్తామని, ఈ కేసును మూసివేసే ప్రసక్తే లేదని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. కోర్టు ధిక్కరణ కేసు కింద విద్యాశాఖతో పాటు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానికి నోటీసులు జారీ చేయనున్నట్లు సుప్రీం తెలిపింది.
న్యాయ వ్యవస్థపై వివాదాస్పద పాఠ్యాంశాన్ని రాసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో చెప్పాలని విద్యాశాఖను అడగనున్నట్లు కోర్టు పేర్కొన్నది. వివాదాస్పదమైన ఆ బుక్కు చెందిన హార్డ్ కాపీలు కానీ డిజిటల్ కాపీలను కానీ మార్కెట్ నుంచి తొలగించాలని కోర్టు తన ఆదేశాల్లో వెల్లడించింది. ఎన్సీఈఆర్టీ ప్రచురించిన క్షమాపణలను త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది.