అహద్మాబాద్: గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ (Gujarat BJP Chief CR Patil) ఆ పార్టీ కార్యకర్తలను నిరుత్సాహపరిచారు. ముహూర్తం దాటడంతో నామినేషన్ దాఖలు చేయకుండా వెళ్లిపోయారు. దీంతో భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు అసంతృప్తి చెందారు. గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్, నవ్సారి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గురువారం నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా నవ్సారి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరారు.
కాగా, ముందుగా అనుకున్న విజయ ముహూర్తమైన మధ్యాహ్నం 12:39 గంటలకు సీఆర్ పాటిల్ అక్కడకు చేరుకోలేకపోయారు. కొంత ఆలస్యంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. శుభ గడియలు మిస్ కావడంతో నామినేషన్ దాఖలు చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏప్రిల్ 19న నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు, అభిమానులు నిరాశ చెందారు.