న్యూఢిల్లీ: గృహహింస(domestic violence) వల్ల చనిపోతున్న పెళ్లి అయిన మగవారి సమస్యలను పరిష్కరించాలని, అలాంటి వారి కేసులకు మార్గదర్శకాలు ఇవ్వాలని ఇవాళ సుప్రీంకోర్టు(supreme court)లో పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ మెన్(National Commission for Men) ఈ అంశాలను పరిశీలించాలని పిటిషన్లో కోరారు. అడ్వకేట్ మహేశ్ కుమార్ తివారి తన అభ్యర్థనలో జాతీయ నేర గణాంకాల బ్యూరో(NCRB) డేటాను ప్రస్తావించారు. 2021లో దేశవ్యాప్తంగా 1,64,033 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. దాంట్లో 81,063 మంది వివాహిత పురుషులు, 28,680 మంది పెళ్లి అయిన మహిళలు ఉన్నట్లు తెలిపారు.ఫ్యామిలీ సమస్యల వల్లే సుమారు 33.2 శాతం మంది పురుషులు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. దాంట్లో కేవలం మ్యారేజ్ సమస్యల వల్ల 4.8 శాతం మంది బలవన్మరణానికి పాల్పడినట్లు వెల్లడించారు.
2021లో మొత్తం 1,18,979 మంది పురుషులు సూసైడ్(Suciding Men) ద్వారా ప్రాణాలు వదిలారని, అది 72 శాతంగా ఉందని, ఇక 45,026 మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారని, వాళ్లది 27 శాతంగా ఉన్నట్లు పిటిషన్లో తెలిపారు. ఎన్సీఆర్బీ ఇచ్చిన డేటా ఆధారంగా అడ్వకేట్ తివారీ(Advocated Tiwari) ఈ విషయాలను ప్రస్తావించారు. పెళ్లి అయిన పురుషుల సమస్యలను పరిష్కరించాలని, వాళ్ల ఫిర్యాదులను గృహ హింస కింద స్వీకరించాలని, దీనిపై మార్గదర్శకాలు ఇవ్వాలని తన పిటిషన్లో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని(National Human Rights Commission) కోరారు. నేషనల్ కమీషన్ ఫర్ మెన్ను ఏర్పాటు చేయాలని కూడా పిటిషన్లో డిమాండ్ చేశారు.