సిడ్నీ, జూలై 14: రక్తం తీయకుండా, నొప్పి లేకుండా షుగర్ టెస్టు చేసే విధానాన్ని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ కొత్త విధానంలో లాలాజలంలో ఉండే ఎంజైమ్ల ఆధారంగా గ్లూకోజ్ స్థాయిని గుర్తిస్తారు. దీనికోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఓ ట్రాన్సిస్టర్ను రూపొందించారు. లాలాజలాన్ని ట్రాన్సిస్టర్పై ఉంచినప్పుడు రక్తంలో గ్లూకోజ్ ఏ స్థాయిలో ఉందనేది తెలుస్తుందని న్యూకేజిల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ దస్తూర్ తెలిపారు. ‘లాలాజలంలో కూడా గ్లూకోజ్ ఉంటుంది. అయితే రక్తంతో పోల్చితే లాలాజలంలో 100 రెట్లు తక్కువ ఉంటుంది. దీన్ని గుర్తించేందుకు ట్రాన్సిస్టర్ను రూపొందించాం’ అని వెల్లడించారు. ఎవరైనా సొంతంగా షుగర్ టెస్టు చేసుకొనే విధంగా టెస్టు కిట్లను తయారు చేస్తున్నట్టు చెప్పారు. దీనికోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది. ఈ టెక్నాలజీతో కరోనా, క్యాన్సర్ పరీక్షలు కూడా చేయవచ్చని పాల్ తెలిపారు. కరోనా టెస్టు విధానాన్ని అభివృద్ధి చేయడానికి హార్వర్డ్ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడించారు. సాధారణంగా షుగర్ టెస్టు చేయాలంటే రక్తం తీయాలి. ఇది చాలా నొప్పితో కూడుకొన్న వ్యవహారం. నొప్పి భరించలేక చాలా మంది టెస్టులు చేసుకోవడానికి వెనుకాడతారు. ఫలితంగా వ్యాధి ముదిరే ప్రమాదం ఉంది.