చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయాలు గానీ, రహస్యాలు గానీ బయటకు పొక్కుతాయని అనుకున్నారో, క్రమశిక్షణో తెలియదు గానీ.. చింతన్ శిబిర్కు హాజరైన ప్రతినిధులు మాత్రం కచ్చితంగా కొన్ని నియమాలు పాటించారు. ఈ నియమాలన్నీ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా సూచించినవే. శిబిర్ జరిగే గ్రౌండ్లోకి ఎవ్వరు కూడా తమ సెల్ఫోన్లను తీసుకురావొద్దని సోనియా స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
అంతే… శిబిర్ ప్రారంభం కంటే ముందే ప్రజా ప్రతినిధులందరి ఫోన్లనూ అక్కడి బాధ్యులు తీసేసుకున్నారు. రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ అందరికీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో అందరూ తమ తమ ఫోన్లను ఓ చోట జమ చేసేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వారికి ఫోన్లు అందుబాటులో వుండని బాధ్యులు పేర్కొంటున్నారు.
అయితే కేవలం క్రమశిక్షణ కోసమే అందరి ఫోన్లను తీసేసుకున్నామని బాధ్యులు పేర్కొంటున్నారు. అయితే.. అక్కడ మాట్లాడే మాటలు గానీ, అసంతృప్త జ్వాలలు గానీ బయటకు ఎట్టి పరిస్థితుల్లోనూ పొక్కకూడదన్న ఏకైక కారణంతోనే ఫోన్లను అనుమతించలేదని తెలుస్తోంది.