చెన్నై, ఆగస్టు 13: పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అమలు చేసే ఉచిత పథకాలు ప్రమాదకరమని, దేశాభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతున్నాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. విద్య, వైద్యం వంటి వాటిపై ప్రభుత్వం పెట్టే వ్యయాన్ని ఉచితాలుగా చూడకూడదని అన్నారు. పేదలు, అణగారిన వర్గాల ప్రజలకు విద్య, వైద్యం అందేలా చర్యలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. చెన్నైలోకి కొలత్తూరులో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్టాలిన్ మాట్లాడుతూ విద్య అనేది జ్ఞానానికి, వైద్యం ఆరోగ్యానికి సంబంధించిందని, ఈ రెండు రంగాల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని తమ ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. ఉచితాలు, సంక్షేమం అనేవి రెండు వేర్వేరు అని, రెండింటినీ ఒకే గాటన కట్టొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ‘ఉచితాలు ఉండకూడదంటూ ఇప్పుడు కొంతమంది కొత్తగా పుట్టుకొచ్చి మాట్లాడుతున్నారు..’ అని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘దీని గురించి మేం బాధపడటం లేదు. నేను ఎక్కువ మాట్లాడితే రాజకీయం అవుతుంది. అందుకే దీనిపై ఎక్కువగా మాట్లాడదలచుకోలేదు’ అని స్టాలిన్ అన్నారు.