హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బుద్ధిమాంద్యం, ఆటిజం వంటి వైకల్యంతో బాధపడుతున్న విద్యార్థుల విద్యా బోధనకు ప్రత్యేకంగా స్పెషల్ టీచర్లు రాబోతున్నారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన వీరిని ప్రభుత్వం డీఎస్సీ ద్వారా రెగ్యులర్ పోస్టు ల్లో నియమించనున్నది. తాజాగా 1,016 స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీకి మంగళవారం ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా స్పెషల్ టీచర్లను నియమించనున్నారు.
సమగ్రశిక్ష సర్వే ప్రకారం రాష్ట్రంలో మొత్తం 78 వేల మంది బుద్ధిమాంద్యం పిల్లలున్నారు. వీరికి సమగ్రశిక్ష ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించిన ఇన్క్లూజివ్ రిసోర్స్పర్సన్స్ (ఐఈఆర్పీ) విద్యాబోధన చేస్తున్నారు. కాగా, ప్రాథమిక స్థాయిలో ప్రతి 15 మంది విద్యార్థులు, మాధ్యమిక విద్యలో ప్రతి 20 మందికి ఒక టీచర్ చొప్పున స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీరికి ప్రత్యేకంగా శిక్షణపొందిన స్పెషల్ బీఈడీ టీచర్లను నియమించాలని తీర్పునిచ్చింది.
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సర్కారు కొత్తగా 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను మంజూరు చేసింది. వీటిలో ఎస్జీటీ 796 పోస్టులుండగా, మరో 727 స్కూల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. వీటి భర్తీకి కేసీఆర్ ప్రభుత్వం చొరవ తీసుకోగా, అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ జారీతో వీలుపడలేదు. అయితే, ప్రస్తుత సర్కారు 1,016 పోస్టుల భర్తీకి తాజాగా ఆమోదం తెలిపింది.
తెరపైకి రెగ్యులరైజేషన్ డిమాండ్
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల రెగ్యులరైజేషన్ డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇప్పటికే భవిత సెంటర్లల్లో పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించి ఆయా పోస్టులను నింపాలని తెలంగాణ ఐఈఆర్పీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్కుమార్, గౌరవాధ్యక్షుడు బోయ శ్రీనివాస్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నోటిఫికేషపన్ ద్వారా నింపడమంటే అరకొర వేతనంతో 20 ఏండ్లుగా పనిచేస్తున్న తమ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంట్రాక్ట్ లెక్చరర్ల తరహాలో తమను క్రమబద్ధీకరించాలని, లేదంటే ఏఎన్ఎంల తరహాలో వెయిటేజీ మార్కులివ్వాలని కోరారు. ఇదే అంశంపై సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించామని.. తమకు న్యాయం చేస్తామని సీఎం హామీనిచ్చారని తెలిపారు. ప్రభుత్వం తమను క్రమబద్ధీకరించకుంటే వేలాది మందితో చలో సచివాలయానికి పిలుపునిచ్చి ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.