UP Assembly Results | ఉత్తరప్రదేశ్లో వరుసగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధం అవుతున్నది. యూపీలో గత 37 ఏండ్లలో ఎవరూ సాధించలేని విజయాన్ని యోగి నమోదు చేశారు. అయితే, రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరితో ఎస్పీ పెట్టుకున్న పొత్తు బాగానే పని చేసినట్లు కనిపిస్తున్నది. యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో ఒక డిప్యూటీ సీఎంతోపాటు 10 మంది మంత్రులను ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి ఇంటికి సాగనంపింది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్య ఓటమి పాలవ్వడంతో బీజేపీకి గట్టి షాక్ తగిలినట్లయింది. సిరాథు స్థానం నుంచి పోటీ చేసిన అప్నాదల్ (కమేర్వాదీ) నాయకురాలు, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ సోదరి డాక్టర్ పల్లవి పటేల్, కేశవ్ ప్రసాద్ మౌర్యను మట్టి కరిపించారు. ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పల్లవి పటేల్, తన ప్రత్యర్థి మౌర్యను 7,337 ఓట్ల తేడాతో ఓడించారు.
మరో పది మంది యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ సభ్యులు విపక్షాల చేతిలో ఓటమి పాలయ్యారు. వాటిలో తొమ్మిది ఎస్పీ, ఒక స్థానం ఆర్ఎల్డీ గెలుచుకున్నది. యూపీ రాష్ట్ర ప్రజా పనుల శాఖ సహాయ మంత్రి చంద్రికా ప్రసాద్ ఉపాధ్యాయ్ను ఎస్పీ అభ్యర్థి అనిల్ కుమార్.. చిత్రకూట్ నుంచి 20,876 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. రెవెన్యూశాఖ సహాయ మంత్రి చత్రపాల్ సింగ్ను బరేలీ జిల్లాలోని బహేరీ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థి అతౌర్ రెహ్మాన్ 3,355 ఓట్ల మెజారిటీతో ఇంటికి సాగనంపారు. చెరకు అభివృద్ధి శాఖ మంత్రి సురేశ్ కుమార్ రాణాను థానా భవన్ స్థానం నుంచి ఆర్ఎల్డీ అభ్యర్థి అశ్రఫ్ అలీఖాన్ 10,806 ఓట్ల తేడాతో ఓడించారు.
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్ (మోతీసింగ్)ను ప్రతాప్గఢ్ జిల్లాలోని పట్టి స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థి రాంసింగ్ 22,051 ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. వ్యవసాయశాఖ మంత్రి లఖన్ సింగ్ రాజ్పుత్ను ఔరారియా జిల్లా దిబియాపూర్ నియోజకవర్గం నుంచి ఎస్పీ అభ్యర్థి ప్రదీప్ కుమార్ యాదవ్ 473 ఓట్ల ఆధిక్యంతో ఓడించారు.
బాల్లియా జిల్లా బరియా స్థానం నుంచి పోటీ చేసిన ఎస్పీ అభ్యర్థి జైప్రకాశ్ అంచల్ చేతిలో పార్లమెంటరీ వ్యవహారాలు, ఓవరాల్ విలేజ్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా 12,951 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. క్రీడా శాఖ మంత్రి ఉపేంద్ర తివారీని ఎస్పీ అభ్యర్థి సంగ్రాం సింగ్ 19,354 ఓట్ల ఆధిక్యంతో ఓడించారు.
ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రి రన్వేంద్ర సింగ్ ధున్నీపై ఫతేపూర్ జిల్లా హుస్సేన్ గంజ్ స్థానం నుంచి ఉషా మౌర్య 25,181ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. సహకారశాఖ సహాయ మంత్రి సంగీతా బల్వంత్పై ఘజీపూర్ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థి జై కిషాన్ 1692 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రాథమిక విద్య (స్వతంత్ర ప్రతిపత్తి) శాఖ సహాయ మంత్రి సతీశ్ చంద్ర ద్వివేదిని సిద్ధార్థ్ నగర్ జిల్లా ఐత్వా స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థి మాతా ప్రసాద్ పాండే 1662 ఓట్ల మెజారిటీతో ఓడించారు.
యోగి ఆదిత్యనాథ్ సారధ్యంలోని బీజేపీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు 255 స్థానాలను గెలుచుకున్నది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్వాదీ పార్టీ 111 స్థానాలతో సరిపెట్టుకున్నది. ఎన్డీఏ మిత్ర పక్షం అప్నాదల్ (సోనేలాల్) 12 సీట్లలో గెలుపొందింది. ఆర్ఎల్డీ 8, కాంగ్రెస్ రెండు, బీఎస్పీ ఒక స్థానానికి పరిమితం అయ్యాయి.