Digital ID | న్యూఢిల్లీ, మే 28: మహానగరాల్లో కొత్తవారు ఏదైనా ఒక అడ్రస్ కనుగొనడమంటే కత్తి మీద సాము చేయడం వంటిదే. గూగుల్ మ్యాప్ సైతం కచ్చితత్వంతో మనం కోరుకున్న చిరునామాకు మనలను తీసుకెళ్లలేకపోతున్నది. కొన్నిసార్లు మనం వెళ్లదలచుకున్న ప్రదేశాన్ని సమీపంలోని బండగుర్తు (ల్యాండ్మార్క్) ఆధారంగా కనుగొనాల్సి వస్తుంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి ఇంటికి (చిరునామాకు) ఆధార్ తరహాలో ఓ ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు నంబర్ ఇవ్వనున్నట్టు తెలిసింది. దీంతో ప్రతి భారతీయుడి నివాసానికి అధికారికమైన ఓ ప్రత్యేక గుర్తింపు నంబర్ (డిజిపిన్ నంబర్) లభించనుంది.
తాను నివసిస్తున్న ప్రదేశానికి భవిష్యత్తులో ఇదే ఐడీ ప్రూఫ్గా మారనుంది. నివాసాలను, ప్రదేశాలను కచ్చితంగా, వేగంగా కనుగొనే లక్ష్యంగా ఈ ప్రత్యేక డిజిటల్ ఐడీ నంబర్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు ఓ ఆంగ్ల పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతమున్న భౌతిక చిరునామాలను డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) వ్యవస్థలో అనుసంధానం చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం దేశంలో అడ్రస్ల డాటాను నిర్వహించేందుకు ఓ ప్రామాణికమైన వ్యవస్థ అందుబాటులో లేదు. దీంతో ఈ పరిస్థితిని ఆసరా చేసుకొని చాలామంది తప్పుడు అడ్రస్లతో మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు ఈ చిరునామాల డాటాకు సంబంధించి దేశంలో స్పష్టమైన నియమ నిబంధనలు అమలులో లేకపోవడంతో పలు ప్రైవేటు కంపెనీలు పౌరుల వద్ద వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, వారి అనుమతి లేకుండానే ఇతరులతో పంచుకుంటున్నాయి. ప్రభుత్వం అమలుచేయనున్న కొత్త డిజిటల్ ఐడీలతో ఈ అక్రమాలన్నింటికీ అడ్డుకట్టవేయవచ్చని ఆ పత్రిక కథనం వివరించింది. డిజిటల్ ఐడీలతో పౌరుల వ్యక్తిగత వివరాలు వారి నియంత్రణలో ఉండిపోతాయి. ఎవరైనా ఆ వివరాలను పొందాలంటే ఇకపై సదరు వ్యక్తి అనుమతి ద్వారానే సాధ్యం కానుంది.
ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్ వ్యవస్థ జోరందుకుంది. లాజిస్టిక్స్, యాప్ ఆధారిత సేవలు (హోం డెలివరీ) విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సేవలందించేందుకు కచ్చితమైన, ప్రామాణికమైన అడ్రస్ల అవసరం పెరిగిపోయింది. దేశంలో ప్రస్తుతం చాలా చిరునామాలు అస్పష్టంగా లేదా అసంపూర్ణంగా ఉంటాయి. కొన్ని అడ్రస్లను కనుగొనాలంటే వాటి సమీపంలోని ఏదైనా ఓ ప్రాముఖ్యమైన ప్రదేశం ఆధారంగా కనుగొనాల్సి వస్తుంది. ఈ అస్పష్టత కారణంగా సేవల వితరణ ఆలస్యమై, ఒక చోట ఇవ్వాల్సిన డెలివరీని మరో చోట ఇవ్వడం, తదితర కారణాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా 10-14 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.14 లక్షల కోట్ల) నష్టం వాటిల్లుతున్నది.
ఇది జీడీపీలో 0.5శాతమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమస్యను అరికట్టేందుకు ప్రభుత్వం ‘డిజిటల్ అడ్రస్ సిస్టమ్’ను అమలులోకి తేనున్నది. దీని ద్వారా ఏదైనా సంస్థ ఆన్లైన్లో మన చిరునామాను పొందాలంటే తప్పనిసరిగా మన అనుమతి పొందాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు త్వరలోనే ఓ ముసాయిదా విధానాన్ని విడుదల చేయనున్నారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ చట్టానికి సంబంధించి తుది రూపునివ్వనున్నట్టు తెలిసింది.
ఈ కొత్త అడ్రస్ వ్యవస్థకు డిజిపిన్ (డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్) కీలకం కానుంది. ఈ నంబర్ పది అంకెలు, అక్షరాలతో ఉంటుంది. కచ్చితమైన మ్యాప్ కోఆర్డినేట్ల ఆధారంగా ఓ ప్రత్యేకమైన 10 అక్షరాల కోడ్గా దీనిని రూపొందించనున్నారు. ప్రస్తుతమున్న పిన్కోడ్ నంబర్లు పోస్ట్ ఆఫీస్ల ఆధారంగా విస్తారమైన ప్రదేశాలకు కేటాయించారు. కానీ డిజిపిన్లను కచ్చితత్వంతో వ్యక్తుల ఇండ్లకు లేదా వ్యాపారాలకు కేటాయించనున్నారు.