Sofia Firdous : ఒడిశా అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఇంతవరకు ఒక ముస్లిం మహిళ ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. కానీ ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ముస్లిం మహిళ ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. ఆమెనే సోఫియా ఫిర్దౌస్. 32 ఏళ్ల సోఫియా కాంగ్రెస్ అభ్యర్థిగా బారాబతి-కటక్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగారు.
ఈ ఎన్నికల్లో ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి పూర్ణచంద్ర మహాపాత్రను ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో ఓడించారు. ఈ కొత్త ఎమ్మెల్యే సోఫియాకు ఆసక్తికర నేపథ్యం ఉన్నది. ఆమె ఒడిశా సీనియర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ మోకిమ్ కుమార్తె. తండ్రిపై అవినీతి ఆరోపణలు ఉండటంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆమెపై అనర్హత వేటుపడింది. దాంతో ఆయన స్థానంలో కూతురు ఫిర్దౌస్ ఎన్నికల్లో పోటీ చేశారు.
అయితే తండ్రి అవినీతి మరక ఈ యువ నాయకురాలు గెలుపును ఆపలేకపోయింది. అంతేకాదు ఒడిశాలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె విజయం ఒడిశా రాజకీయ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఫిర్దౌస్ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేశారు. ఆ తర్వాత 2022లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎంబీ) నుంచి ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ను కూడా పూర్తి చేశారు.
2023లో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఆర్ఈడీఏఐ) అధ్యక్షురాలిగా ఫిర్దౌస్ ఎన్నికయ్యారు. అలాగే సీఆర్ఈడీఏఐ మహిళా విభాగానికి ఈస్ట్ జోన్ కో ఆర్డినేటర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) కు కో చైర్మన్గా పని చేశారు. అంతేగాదు మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఐఎన్డబ్ల్యూఈసీ సభ్యురాలిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
ఫిర్దౌస్ ప్రముఖ పారిశ్రామికవేత్త షేక్ మెరాజ్ ఉల్ హక్ను వివాహం చేసుకున్నారు. రాజకీయాల్లో ఒడిశా తొలి మహిళా ముఖ్యమంత్రి నందిని సత్పతి తనకు ఆదర్శమని ఆమె చెబుతోంది. విశేషం ఏమిటంటే 1972లో బారామతి-కటక్ నియోజకవర్గం నుంచే నందిని సత్పతి గెలుపొందారు. కాగా 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన రాజకీయ మార్పు కనిపించింది.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మొత్తం 147 సీట్లలో 78 స్థానాలను గెలుచుకుంది. దాంతో 24 ఏళ్లపాటు ఏకధాటిగా పాలించిన బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీ చీఫ్ నవీన్ పట్నాయక్ పాలనకు తెరపడింది.