న్యూఢిల్లీ, జూలై 3: సోషల్మీడియాపై కఠిన నియంత్రణలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవాలా అభిప్రాయపడ్డారు. అర్ధసత్యాలు ప్రచారం చేసేవారితో, న్యాయపాలన, న్యాయ పరిమితులపై అవగాహనలేని వారితో సోషల్మీడియా నిండిపోయిందని పేర్కొన్నారు. ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ పార్దీవాలా కూడా ఉన్నారు. ఆదివారం నిర్వహించిన జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నా మెమోరియల్ నేషనల్ సింపోజియంలో ఆయన మాట్లాడారు. ‘విచారణలు కోర్టులే చేపట్టాల్సి ఉన్నది. డిజిటల్ మీడియా ట్రయల్స్ న్యాయవ్యవస్థలో అనవసర జోక్యం చేసుకోవడమే. ఇది ఒక్కోసారి లక్ష్మణరేఖ దాటుతున్నది.
ఇది ఆందోళనకరం. అర్ధసత్యాలు ప్రచారం చేయడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. సద్విమర్శలను కోర్టు ఎప్పుడూ సహృదయంతో స్వాగతిస్తుంది’ అని పేర్కొన్నారు. జడ్జిలపై వ్యక్తిగత దాడులను ఏమాత్రం సహించేది లేదని స్పష్టంచేశారు. సోషల్ మీడియాలో జడ్జిల తీర్పులపై సద్విమర్శలు చేయడానికి బదులు వ్యతిగత దాడులకు దిగుతున్నారని, ఇది న్యాయవ్యవస్థ గౌరవానికి భంగకరమని వ్యాఖ్యానించారు. డిజిటల్, సోషల్ మీడియాను నియంత్రించి, రాజ్యాంగం ప్రకారం న్యాయపాలన సాగేలా చూడాల్సిన అవసరం ఉన్నదని స్పష్టంచేశారు.