హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రహదారులకు మహర్దశ పట్టింది. రాష్ట్రంగా ఏర్పడిన ఆరేండ్లలోనే 3,842 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం జరిగింది. దీంతో రాష్ట్రంలో రహదారుల విస్తీర్ణం 28,087 కిలోమీటర్లకు చేరుకున్నది. మారుమూల అటవీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో సమైక్యరాష్ట్రంలో మనుషులు నడవడానికి కూడా వీలులేని రహదారులు నేడు అద్దంలా మెరుస్తున్నాయి. రోడ్డు సౌకర్యం పెరగడంతో భూముల ధరలు మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా పలుకుతున్నాయి. రోడ్నెట్వర్క్ ఎంత అభివృద్ధి చెందితే రాష్ట్రం అంతముందుకెళుతుందని భావించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
గ్రామం నుంచి మండల కేంద్రానికి సింగిల్లేన్, మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లేన్, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి నాలుగు లేన్ల రోడ్లు నిర్మించాలని నిర్ణయించి.. 129,130,131 జీవోలు విడుదల చేయించారు. ఈ ప్రత్యేక జీవోలతో రాష్ట్రంలో రోడ్ల స్వరూపం పూర్తిగా మారిపోయింది. మూరుమూల ప్రాంతంలోని ఆవాసాలకూ రోడ్డు సౌకర్యం ఏర్పడింది. రోడ్ల నిర్మాణంలో భాగంగా వాగులు, వంకలపై ఆధునిక బ్రిడ్జిలను నిర్మించారు. ఒక్క అదిలాబాద్ జిల్లాలోనే 45 బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. దీంతో రాష్ట్రం ఏర్పడేనాటికి 24,245 కిలోమీటర్లు ఉన్న రాష్ట్ర రహదారులు ఆరేండ్లలోనే 28,087 కిలోమీటర్లకు చేరుకున్నాయి. 6,093 కిలోమీటర్లు ఉన్న డబుల్ లేన్ రోడ్లు 13,273 కిలోమీటర్లకు, రాష్ట్రప్రభుత్వం ఆధీనంలో ఆరు/ నాలుగు లేన్ల రోడ్లు 669 కిలోమీటర్ల నుంచి 1,029 కిలోమీటర్లకు విస్తరించాయి.
పెరిగిన జాతీయ రహదారులు
తెలంగాణ ఏర్పడ్డాక అదనంగా 1,784 కిలోమీటర్ల జాతీయ రహదారులను రాష్ట్రప్రభుత్వం సాధించింది. 2014 నాటికి తెలంగాణ ప్రాంతంలో జాతీయ రహదారులు 2,527 కిలోమీటర్లు మాత్రమే ఉండేవి. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కేంద్ర ప్రభుత్వం వద్ద రహదారుల నిర్మాణం కోసం చేసిన కృషి ఫలించి జాతీయ రహదారుల సంఖ్య బాగా పెరిగింది. తాజాగా కేంద్రం మంజూరు చేసిన 301 కిలోమీటర్ల రెండు నేషనల్ హైవేలతో రాష్ట్రంలో జాతీయరహదారుల విస్తీర్ణం 4,211 కిలోమీటర్లకు పెరిగింది.
పెరిగిన డబుల్లేన్.. తగ్గిన సింగిల్ లేన్
రహదారులు ఎక్కువగా డబుల్లేన్గా మారుతుండటంతో సింగిల్లేన్ రోడ్లు తగ్గుతున్నాయి. గతంలో 16,864 కిలోమీటర్లు ఉన్న సింగిల్ లేన్ రోడ్లు 13,511 కిలోమీటర్లకు తగ్గాయి, అలాగే 619 కిలోమీటర్లున్న ఇంటర్మీడియట్ రోడ్లు 274 కిలోమీటర్లకు తగ్గిపోయాయి. ఇవన్నీ డబుల్లేన్ రోడ్లుగా మారిపోయాయి. దీంతో డబుల్లేన్ రోడ్లు ఒక్కసారిగా 13,273 కిలోమీటర్లకు పెరిగాయి. 723 కిలోమీటర్లు సీసీ, 26,028 కిలోమీటర్లు బ్లాక్ టాప్, 615 కిలోమీటర్లు మెటాల్డ్, 721 కిలోమీటర్లు అన్మెటాల్డ్ రోడ్లను నిర్మించారు.
భూమి ధర నాలుగింతలు
గ్రామానికి రహదారి సౌకర్యం పెరగడంతో భూములకు డిమాండ్ పెరిగిపోయింది. గతంలో గ్రామానికి బీటీ రోడ్లు, వాగుపై వంతెన లేకపోవడంతో ఇబ్బంది పడేవాళ్లం. కజ్జర్ల నుంచి దేవాపూర్ గ్రామాల మధ్య రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డుతోపాటు, బ్రిడ్జి నిర్మాణంతో భూముల విలువ పెరిగింది. గతంలో ఎకరానికి రూ.4లక్షల నుంచి రూ.5 లక్షలు ఉన్న ధర ప్రస్తుతం రూ.20 నుంచి రూ.25 లక్షలు పలుకుతున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన రోడ్లతో లాభం జరుగుతున్నది.
వాగులు దాటుకుంటూ పోయేటోళ్లం..
గతంలో మేము వ్యవసాయ పనుల కోసం వాగు దాటాల్సి వచ్చేది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పంటలు వేయకపోయేవాళ్లం. పంటలు వేసినా ఎడ్ల బండి కూడా పోయేదారిలేక మందు బస్తాలు మోసుకుంటూ వెళ్తూ ఇబ్బందులు పడేటోళ్లం. నాలుగేళ్ల కిందట కజ్జర్ల నుంచి రుయ్యాడికి నాలుగు కిలోమీటర్లు రోడ్డు వేశారు. వాగు మీదు వంతెన నిర్మించారు. అప్పటి నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు పంటలు చేస్తున్నాం.