ముంబై: అక్రమ అబార్షన్ కేసు విచారణ కోసం పోలీసులు దవాఖానకు వెళ్లారు. అక్కడ క్షుణ్ణంగా పరిశీలించగా మరో దారుణం వెలుగుచూసింది. ఆస్పత్రి ఆవరణలో ఆరు పుర్రెలు, 54 ఎముకలు లభించాయి. అసలు ఆ పుర్రెలు, ఎముకలు ఎవరివి ? అవి అక్కడ ఎందుకు ఉన్నాయి ? అనే కోణంలో విచారణ ప్రారంభించారు. ఈ విస్తుపోయే ఘటన మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో జరిగింది.
వార్ధా జిల్లాలోని ఆర్వీ తహసీల్ పరిధిలో కదం అనే ప్రైవేటు దవాఖాన ఉన్నది. అందులో అక్రమంగా ఓ 13 ఏండ్ల బాలికకు అబార్షన్ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో అబార్షన్ చేసిన డాక్టర్ రేఖా కదం, నర్సును బుధవారం అరెస్టు చేశారు. విచారణలో భాగంగా వారిచ్చిన సమాచారంతో గురువారం దవాఖాన పరిసరాలను పరిశీలించారు. ఈ క్రమంలో హాస్పిటల్ ఆవరణలో ఉన్న బయోగ్యాస్ ప్లాంట్లో సోదాలు నిర్వహించారు. దీంతో అక్కడ 11 పుర్రెలు, 54 ఎముకలు లభించాయని పోలీసులు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపామన్నారు. వాటిని అక్కడ ఎందుకు ఉన్నాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
‘ఓ యువకుడి వల్ల మైనర్ బాలిక గర్భం దాల్చింది. దీంతో యువకుడి తల్లిదండ్రులు ఆమెకు అబార్షాన్ చేయించడానికి కదం దవాఖాన వైద్యులను సంప్రదించారు. దీనికోసం వారికి వారం క్రితమే డబ్బు కూడా ఇచ్చారు. అబార్షన్కు ఒప్పుకోకపోటే పరువు తీసేస్తామని బాలిక తల్లిదండ్రులను.. యువకుడి పేరెంట్స్ బెదిరించారు’ అని ఇన్స్పెక్టర్ భానుదాస్. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని, దీంతో యువకుడిపై పోక్సో చట్టం కింద, అతని తల్లిదండ్రులు, డాక్టర్పై కేసు నమోదుచేశామన్నారు.