రాంచి: జార్ఖండ్లో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం ( Road accident ) జరిగింది. ఎదురెదురుగా వస్తున్న బస్సు, ట్యాంకర్ ఒకదానినొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులోని ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పాకూర్ జిల్లాలోని ఆమ్రపార ఏరియాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
స్థానికుల సాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. కాగా, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.