Delhi-Zurich flight : టేకాఫ్ అవుతుండగా విమానం ఇంజిన్లో సమస్య తలెత్తడం (Engine Failure) తో మంటలు చెలరేగిన ఘటన ఢిల్లీ ఎయిర్పోర్టులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆ ఆరుగురిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్విస్ (SWISS) విమానం స్విట్జర్ల్యాండ్లోని జ్యూరిచ్కు బయల్దేరడానికి సిద్ధమైంది. టేకాఫ్ అవుతున్న సమయంలో విమానం ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
వెంటనే విమానాన్ని నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించేశారు. అత్యవసర సాధనాలను ఉపయోగించి ప్రయాణికులను కిందకు దించుతున్న సమయంలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఘటన సమయంలో విమానంలో సిబ్బంది సహా 232 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేశామని చెప్పారు. త్వరలోనే మరో విమానంలో వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.