వాషింగ్టన్: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఆరుగురు భారతీయులు అరెస్టయ్యారు. కెనడా, అమెరికా సరిహద్దు ప్రాంతంలో ఈ మానవ అక్రమ రవాణా సంఘటన వెలుగుచూసింది. ఏప్రిల్ 28న కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ కార్న్వాల్ నుంచి సెయింట్ రెగిస్ నదిలో చిన్న పడవ ద్వారా అమెరికా సరిహద్దు ప్రాంతమైన అక్వేసాస్నే మోహాక్కు కొందరు అక్రమంగా వెళ్తున్నారు. గమనించిన కెనడా అధికారులు ఆ ప్రాంతంలోని అమెరికా అధికారులకు సమాచారం అందించారు. వారు సెయింట్ రెగిస్ మోహాక్ గిరిజన పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేశారు.
దీంతో ఆ ప్రాంత మెరైన్ పోలీసులు, ఫైర్ సిబ్బంది రెస్క్యూ బోటులో ఆ చిన్న పడవ వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే అది మంచుతో గడ్డకట్టిన నదిలో చిక్కుకుని సగం మునిగి ఉంది. అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఈదుకుని సమీపంలోని ఒడ్డుకు చేరాడు. కాగా, మునుగుతున్న బోటులో ఉన్న ఆరుగురిని భారతీయ పౌరులుగా యూఎస్ పోలీసులు గుర్తించారు. వారి వద్ద ఎలాంటి లైఫ్ జాకెట్లు లేదా సెఫ్టీ పరికరాలు లేవని గ్రహించారు. చికిత్స అందించిన తర్వాత అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధికారులు వారిని అరెస్ట్ చేశారు.
మరోవైపు అరెస్టైన ఆరుగురు భారతీయులు 19-21 ఏళ్ల వయసు వారని, అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు విఫల యత్నం చేశారని అమెరికా అధికారులు ఆరోపించారు. ఎన్ఏ పటేల్, డీహెచ్ పటేల్, ఎన్ఈ పటేల్, యూ పటేల్, ఎస్ పటేల్, డీఏ పటేల్ పేర్లున్న ఆరుగురు భారతీయ పౌరులను, అమెరికాకు చెందిన బ్రియాన్ లాజోర్, మానవ అక్రమ రవాణాకు సహకరించినట్లు కేసు నమోదు చేశారు.
కాగా, ఈ ఏడాది జనవరిలో కెనడా సరిహద్దు ప్రాంతం నుంచి అమెరికాలోకి అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నించిన గుజరాత్కు చెందిన ఒక కుటుంబం ప్రయాణిస్తున్న కారు అక్కడి మంచు ప్రాంతంలో చిక్కుకుంది. దీంతో అందులోని 39 ఏళ్ల జగదీష్కుమార్ బల్దేవ్భాయ్ పటేల్, ఆయన భార్య 37 ఏళ్ల వైశాలిబెన్, వారి కుమార్తె 11 ఏళ్ల విహంగీ, కుమారుడు మూడేళ్ల ధార్మిక్ ఆ కారులోనే మరణించడం కలకలం రేపింది.