ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు ముందు వెళ్తున్న మారుతి ఆల్టో కారును బలంగా ఢీకొట్టింది. దాంతో కారు ఫల్టీలు కొడుతూ రోడ్డుపక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించిన సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో కారులోని ఆరుగురిని వెలికితీసి ఫరీదాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు.
ఫరీదాబాద్-గురుగ్రామ్ రహదారిపై మంగార్ పోలీస్ పోస్టు సమీపంలో గురువారం అర్ధారాత్రి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులంతా పల్వాల్ ఏరియాకు చెందిన వారని చెప్పారు. పల్వాల్ నుంచి గురుగ్రామ్లోని ఓ పార్టీ కారులో వెళ్లిన ఆరుగురు తిరుగ ప్రయాణంలో ప్రమాదం బారిన పడ్డారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను వెనుక కారులోనే ఉన్నానని మృతుల్లో ఒకరి పినతండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. మృతులంతా 18 నుంచి 25 మధ్య వయస్కులేనని చెప్పారు.