న్యూఢిల్లీ: రానురాను జాతీయ పార్టీల సంఖ్య తగ్గిపోతున్నది. (National Parties Fall ) దేశంలో తొలి లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు 14 జాతీయ పార్టీలున్నాయి. అనంతరం 70 ఏళ్లలో ఈ సంఖ్య 6కు పడిపోయింది. అయితే తొలుత 53 రాజకీయ పార్టీలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 2,500కుపైగా ఉన్నది. 1951లో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో 53 రాజకీయ పార్టీలు పోటీ చేశాయి. ఇందులో 14 పార్టీలను జాతీయ పార్టీలుగా గుర్తించగా మిగతా వాటిని రాష్ట్రాలకు చెందిన పార్టీలుగా పరిగణించారు.
కాగా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ప్రచురించిన ‘లీప్ ఆఫ్ ఫెయిత్’ పుస్తకం ప్రకారం 1953కు ముందు 29 రాజకీయ పార్టీలు జాతీయ పార్టీ హోదాను డిమాండ్ చేశాయి. వాటిలో 14 పార్టీలకు మాత్రమే జాతీయ హోదా ఇవ్వాలని నిర్ణయించారు. అయితే 1953 ఎన్నికల తర్వాత కేవలం నాలుగు పార్టీలైన కాంగ్రెస్, ప్రజా సోషలిస్ట్ పార్టీ (సోషలిస్ట్ పార్టీ, కిసాన్ మజ్దూర్ పార్టీల విలీనంతో ఏర్పడిన పార్టీ), సీపీఐ, జనసంఘ్ మాత్రమే జాతీయ పార్టీ హోదా దక్కించుకున్నాయి.
మరోవైపు 1957లో రెండో లోక్సభ ఎన్నికల నాటికి దేశంలోని రాజకీయ పార్టీల సంఖ్య 15కు తగ్గింది. ఇందులో నాలుగు జాతీయ పార్టీలు పోటీలో నిలిచాయి. 1962లో జరిగిన మూడో లోక్సభ ఎన్నికల్లో 27 పార్టీలు పోటీ పడ్డాయి. సోషలిస్ట్ (ఎస్వోసీ), స్వతంత్ర (ఎస్డబ్ల్యూఏ) పార్టీలు ఎన్నికల బరిలో నిలువడంతో జాతీయ పార్టీల సంఖ్య ఆరుకు పెరిగింది.
దేశ స్వాతంత్య్రం తర్వాత భారత జాతీయ కాంగ్రెస్లోని వామపక్ష వర్గానికి చెందిన జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, ఆచార్య నరేంద్ర దేవ్ తదితరులు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నుంచి మారిన సోషలిస్ట్ పార్టీని స్థాపించారు. అనంతరం ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ రాణించలేకపోయింది. దీంతో జేబీ కృపలానీ కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ (కేఎంపీపీ)తో కలిసి ప్రజా సోషలిస్ట్ పార్టీ (పీఎస్పీ)గా ఏర్పడింది. ఎమర్జెన్సీ తర్వాత జైలు నుంచి విడుదలైన జయప్రకాష్ నారాయణ్, ఇతర పీఎస్పీ నేతలు, ఇతర రాజకీయ గ్రూపులు కలిసి భారతీయ లోక్ దళ్ (బీఎల్డీ)గా ఏర్పడ్డాయి. 1977లో ఇది జనతా పార్టీ (జేపీ)గా రూపాంతరం చెందింది. అనంతర కాలంలో భారత జనతా పార్టీ (బీజేపీ), సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వంటి పార్టీలు జేపీ నుంచి ఏర్పడ్డాయి.
మరోవైపు 1992 లోక్సభ ఎన్నికల వరకు ప్రధానంగా ఏడు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనతాదళ్ (జేడీ), జనతా పార్టీ (జేపీ), లోక్దళ్ పోటీలో ఉన్నాయి. అయితే 1996 లోక్సభ ఎన్నికల్లో 209 పార్టీలు పాల్గొన్నాయి. ఇందులో కాంగ్రెస్ (ఐఎన్సీ), ఆల్ ఇందిరా కాంగ్రెస్ (తివారీ), బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనతాదళ్, జనతా పార్టీ, సమతా పార్టీ వంటి ఎనిమిది జాతీయ పార్టీలున్నాయి.
కాగా, 1998 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, జనతాదళ్, సీపీఐ, సీపీఎం, సమతా వంటి ఏడు జాతీయ పార్టీలతో సహా 176 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. 1999లో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, జనతాదళ్ (సెక్యులర్), జనతాదళ్ (యునైటెడ్) వంటి ఏడు జాతీయ పార్టీలతో సహా 160 రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి.
తొలి ఎన్నికల నుంచి 2014 వరకు జరిగిన 14 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 11 సార్లు విజయం సాధించింది. ఆ తర్వాత బీజేపీ హవా కొనసాగింది. 1951 ఎన్నికల తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీగా సీపీఐ రాణించింది. 1964లో రష్యా, చైనాలో కమ్యూనిజం ప్రభలడంతో సీపీఐ చీలికతో ఏర్పడిన సీపీ(ఎం) అనంతర ఎన్నికల్లో హవా కొనసాగించింది.
మరోవైపు 2016లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ) జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. దీంతో 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, ఏఐటీసీ వంటి ఏడు జాతీయ పార్టీలతో సహా మొత్తం 674 పార్టీలు పోటీ చేశాయి. అయితే ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) జాతీయ పార్టీ హోదాను కోల్పోయాయి.
కాగా, 2023లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం (ఈసీ) గుర్తించింది. దీంతో ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సీపీఐ(ఎం), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), ఆప్తో కలిపి ఆరు జాతీయ పార్టీలు ఉన్నాయి. మరోవైపు దేశంలో మొత్తం రాజకీయ పార్టీల సంఖ్య 2,500కు పైగా ఉన్నది.
నిబంధనల ప్రకారం జాతీయ పార్టీ హోదా పొందడానికి ఒక రాజకీయ పార్టీ కనీసం మూడు వేర్వేరు రాష్ట్రాల నుంచి లోక్సభ మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం గెలవాలి. లేదా నాలుగు లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించాలి. లేదా నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి.