గ్యాంగ్టక్, అక్టోబర్ 4: భారీ వర్షాలతో ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం రాత్రి కుంభవృష్టి కురిసింది. లాచెన్ లోయలోని తీస్తా నదిలోకి వరద నీరు పోటెత్తింది. దీంతో తీస్తా నది బేసిన్లో అర్ధరాత్రి దాటిన తర్వాత సంభవించిన ఆకస్మిక వరదల్లో 82 మంది గల్లంతయ్యారు. వీరిలో 22 మంది జవాన్లు, మరో 60 మంది పౌరులు ఉన్నారు. గల్లంతైన వారిలో 10మంది మరణించారని, మిగతా వారి కోసం గాలింపు చేపట్టినట్టు అధికారులు బుధవారం వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో చుంగ్థాంగ్ డ్యామ్ నుంచి నీరు విడుదల చేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని, తీస్తా నదిలో నీటి మట్టం ఒక్కసారిగా 15-20 అడుగుల మేర పెరిగిందని అధికారులు తెలిపారు. దీంతో అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వరదలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో ఈ ప్రకృతి వైపరీత్యాన్ని సిక్కిం ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది.
వరదల తీవ్రతకు లాచెన్ లోయలోని ఆర్మీ పోస్టులు నీట మునిగాయి. సింగ్తమ్ ప్రాంతంలో ఆర్మీ వాహనాలు కొట్టుకుపోయాయి. అందులోని 22 మంది గల్లంతైనట్టు ఆర్మీ ఈస్ట్రన్ కమాండ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. వరదలు సంభవించిన ప్రాంతంలో ఇంటర్నెట్ సదుపాయం సరిగా లేకపోవడంతో అక్కడి ఆర్మీ సిబ్బందిని సంప్రదించడం కష్టంగా మారిందని సైనిక వర్గాలు తెలిపాయి.
ఆకస్మిక వరదలతో తీస్తా నది బేసిన్లోని దిక్చు, సింగ్తమ్, రంగ్పో పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులు నీటమునిగాయి. వందలాది ఇండ్లు దెబ్బతిన్నాయి. తీస్తా నది ఉగ్రరూపానికి రాష్ట్ర రాజధాని గ్యాంగ్టక్కు 30 కిలోమీటర్ల దూరంలోని సింగ్తమ్ వద్ద ఉన్న స్టీల్ బ్రిడ్జి ఒకటి కొట్టుకుపోయింది. మరో 13 చోట్ల బ్రిడ్జిలు కూలిపోయాయి. పశ్చిమబెంగాల్, సిక్కింను కలిపే 10వ నంబర్ జాతీయ రహదారి చాలా చోట్ల దెబ్బతిన్నది. వరదల నేపథ్యంలో మంగన్, గ్యాంగ్టక్, పాక్యోంగ్, నమ్చి జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 8 వరకు సెలవులు ప్రకటించినట్టు విద్యాశాఖ పేర్కొన్నది.