న్యూఢిల్లీ: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా వ్యవహారం కాంగ్రెస్ పార్టీ అధిష్థానాన్ని ఆశ్చర్య పరిచిందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వినీ కుమార్ వ్యాఖ్యానించారు.
ఇది చాలా దురదృష్టకర పరిణామం. దీన్ని పార్టీ హై కమాండ్ ఆశ్చర్యకరంగా పరిగణిస్తున్నది. ఇది ఊహించిన పరిణామం కాదు. పలు రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రతిష్ఠాత్మక పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూ నియామకం జరిగింది అని అశ్వినీ కుమార్ పేర్కొన్నారు.
ఒకవేళ ఆయన (సిద్ధూ) ఏ విషయంలోనైనా కలత చెంది ఉంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దృష్టికి తీసుకు రావాలి. ఆయన ఇబ్బందులను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు. నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ పార్టీ మారతారా? అన్న ప్రశ్నపై స్పందిస్తూ మనస్సులోకి తాను తొంగి చూడలేనని, ఆయన ఏం చేస్తారో తాను ఊహించలేనన్నారు.