చండీఘఢ్ : తనకు అధికార దాహం లేదని, పంజాబీల ప్రయోజనాల కోసం ఎంతకైనా పోరాడతానని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పష్టం చేశారు. పంజాబ్ సీఎం పదవికి తాను పోటీలో లేనని చెప్పారు. సిద్ధూ ఓ వార్తా చానెల్తో మాట్లాడుతూ పలు విషయాలు ముచ్చటించారు. రాష్ట్రంలో సీఎం అభ్యర్ధిని ప్రకటించకుండా ముందుకెళ్లాలన్నది పార్టీ అధిష్టానవర్గం నిర్ణయమని చెప్పారు.
తాను ఎలాంటి పదవికీ రేసులో లేనని అన్నారు. పంజాబ్ ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తానని అన్నారు. బీజేపీ తనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని లబ్దిపొందిందని చెప్పారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ చెప్పినట్టు ఆడుతున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధిపై చర్చకు రావాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు సిద్ధూ సవాల్ విసిరారు.
కేజ్రీవాల్ క్యాబినెట్లో ఒక్క పంజాబీ కూడా లేడని అన్నారు. కెప్టెన్ సింగ్, చన్నీ హయాంలో ప్రభుత్వ విధానాలనే తాను ప్రశ్నించానని సొంత పార్టీ సర్కార్లతో విభేదించలేదని చెప్పుకొచ్చారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక కాంగ్రెస్తో ఆప్, అకాలీదళ్, బీజేపీ-పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూటమి తలపడుతున్నాయి. ఫిబ్రవరి 20న ఒకే దశలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.