లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీకి పలు వాహనాల్లో ర్యాలీగా బయలు దేరిన పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను యూపీలోని సహరాన్పూర్ సరిహద్దులో ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్ధూ వెంట పలువురు పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారు. లఖింపూర్ ఖేరీలో రైతులను వాహనంతో తొక్కించిన ఘటనపై బీజేపీకి వ్యతిరేకంగా పంజాబ్లోని మొహాలీ నుంచి యూపీలోని లఖింపూర్ ఖేరీకి గురువారం చేపట్టిన భారీ కాంగ్రెస్ ర్యాలీకి సిద్ధూ నేతృత్వం వహించారు.
కాగా, హర్యానా సరిహద్దు ప్రాంతం యమునా నగర్కు చేరిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల వాహనాలను యూపీ సరిహద్దు ప్రాంతమైన సహరాన్పూర్లో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధూ యూపీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రైతుల హత్యకు కారణమైన కేంద్ర మంత్రి కుమారుడిపై ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులు బాధిత రైతు కుటుంబాల బాధను పంచుకునేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడంపై మండిపడ్డారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడ్ని శుక్రవారంలోగా అరెస్ట్ చేయకపోతే తాను నిరాహార దీక్షకు దిగుతానని సిద్ధూ హెచ్చరించారు.