పాటియాలా: మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. 1998 నాటి దాడి కేసులో అతనికి సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. పాటియాలా జైలులో ఉన్న అతన్ని ఇవాళ ఉదయం రాజింద్ర హాస్పిటల్కు మెడికల్ చెకప్ కోసం తీసుకువెళ్లారు. జైలులో స్పెషల్ డైట్ ఇవ్వాలని సిద్దూ పిటిషన్ పెట్టుకున్నట్లు ఆయన తరపు న్యాయవాది హెచ్పీఎస్ వర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్యుల బృందం సిద్దూకు రకరకాల పరీక్షలు చేపట్టనున్నది. పరీక్షల తర్వాత డాక్టర్ల బృందం స్థానిక పాటియాలా కోర్టుకు ఆహారానికి సంబంధించిన నివేదికను సమర్పించనున్నది.
గోధుమ, చక్కర, మైదాతో పాటు కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ను సిద్దూ తీసుకోలేడని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బెర్రీలు, పొప్పడి, జామ, డబుల్ టోన్డ్ పాలతో పాటు కార్బోహైడ్రేట్స్ లేని ఆహారాన్ని తీసుకోనున్నట్లు వెల్లడించారు. సిద్దూ వయసు 58 ఏళ్లు. ఆయనకు ఎంబాలిజం, లివర్ సంబంధిత వ్యాధులు ఉన్నాయి. డీప్ వీన్ త్రోంబోసిస్(డీవీటీ) సర్జరీ కూడా చేయించుకున్నారు.