బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్దరామయ్య సభలో నిలబడి సీరియస్గా మాట్లాడుతుండగా ఆయన పంచె ఊడిపోబోయింది. గమనించిన ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆయన వద్దకు వెళ్లి చెవిలో ఈ విషయం చెప్పారు. దీంతో అవునా అంటూ సిద్దరామయ్య తన సీటులో కూర్చుకున్నారు. పంచె సరి చేసుకున్నాక ప్రసంగాన్ని కొనసాగిస్తానని అన్నారు. దీంతో సభలోని వారంతా నవ్వుకున్నారు.
ఇటీవల మైసూర్లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై అసెంబ్లీలో సీరియస్గా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఈ ఘటన జరిగింది. చైర్లో ఉన్న మధు బంగారప్ప “సమస్య ఏమిటో మీరే వెల్లడిస్తే గమ్మత్తుగా ఉంటుంది” అని అన్నారు. దీంతో పంచెను సరిచేసుకున్న సిద్దరామయ్య, కరోనా నుంచి కోలుకున్న తర్వాత తాను నాలుగైదు కేజీల బరువు పెరిగినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తన పొట్ట పెరుగడంతో నిలబడి మాట్లాడుతున్నప్పుడు పంచె ఊడిపోబోయిందని చెప్పారు. కాగా, సహాయం కావాలా అని అధికార పక్ష సభ్యులు, మంత్రి కేఎస్ ఈశ్వరప్ప నవ్వుతూ అడిగారు. అయితే మీరు అధికార బెంచ్లో ఉన్నందున సహాయం కోరబోనని సిద్దరామయ్య అన్నారు.
మరోవైపు సిద్దరామయ్యతోపాటు పార్టీ గౌరవాన్ని కాపాడేందుకు తమ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఈ విషయాన్ని ఆయన చెవిలో చెప్పారని, అయితే సిద్దరామయ్య ఈ విషయాన్ని సభ మొత్తానికి వెల్లడించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు దీన్ని అవకాశంగా తీసుకుని తమ ఇమేజ్ను దెబ్బతీసేందుకు బీజేపీ నేతలు ఎదురుచూస్తున్నారంటూ హాస్యమాడారు. అయితే దీనికి సిద్దరామయ్య స్పందిస్తూ ‘బీజేపీ నేతలు దీనికి ప్రయత్నించినా మన ఇమేజ్ను దెబ్బతీయలేరు’ అని వ్యాఖ్యానించారు.