Siddaramaiah | బెంగళూరు, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి), న్యూఢిల్లీ: నాలుగు రోజుల సస్పెన్స్కు తెర పడింది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్ధరామయ్య(75) పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ ఏకైక ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ప్రకటించింది. గురువారం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ(ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ ఈ వివరాలు వెల్లడించారు. 2024 లోక్సభ ఎన్నికల వరకు శివకుమార్ కేపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని తెలిపారు.
‘సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు మే 20న మధ్యాహ్నం 12.30కు ప్రమాణ స్వీకారం చేస్తారు’ అని ఆయన చెప్పారు. సిద్ధూ, డీకే చెరి రెండున్నరేండ్ల పాటు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అధిష్ఠానం చేసిన రాజీ సూత్రానికి తలొగ్గిన శివకుమార్ తన ఆందోళన విరమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం రాత్రి జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం సీనియర్ నేత సిద్ధరామయ్యను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అనంతరం సిద్ధరామయ్య, శివకుమార్ తదితరులు రాజభవన్కు వెళ్లి గవర్నర్ను కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరగా, దానికి ఆయన అంగీకరించారు. ప్రమాణ స్వీకారానికి బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ర్టాల సీఎంలు, ప్రముఖ జాతీయస్థాయి విపక్ష నేతలను ఆహ్వానించినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఒకప్పటి విరోధి… నేడు రథ సారథి
జనతా పార్టీ కుటుంబం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సిద్ధరామయ్య ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి బద్ధ విరోధి. కానీ జేడీ(ఎస్) అగ్రనేత దేవెగౌడతో విభేదాల వల్ల ఆ పార్టీ నుంచి 2006లో సస్పెండ్ అయ్యారు. అనంతరం తాను తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్ పార్టీలోనే చేరి 2008 ఎన్నికల్లో గెలిచి సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. 2013లో మొదటిసారి సీఎం అయ్యారు. రాజకీయాల్లో ధన బలాన్ని తట్టుకోలేక ఒకానొక దశలో రాజకీయ సన్యాసం తీసుకొని తిరిగి న్యాయవాదిగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. మైసూర్ విశ్వ విద్యాలయం నుంచి బీఎస్సీ, లా డిగ్రీ పూర్తి చేసిన సిద్ధరామయ్య రాజకీయాల్లోకి రాక ముందు కొంత కాలం న్యాయవాదిగా, అతిథి అధ్యాపకులుగా పని చేశారు. ఇప్పటి వరకు సిద్ధరామయ్య తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
కొన్నిసార్లు మంచు గడ్డ బద్ధలు కావాల్సిందే!
పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా సీఎం ఎంపికలో అధిష్ఠానం సూచించిన సయోధ్యకు(సమీకరణానికి) తాను అంగీకరించానని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ వెల్లడించారు. ‘త్వరలో పార్లమెంట్ ఎన్నికలున్నాయి. ఏఐసీసీ ప్రెసిడెంట్, గాంధీ కుటుంబం చెప్పినదాన్ని నేను శిరసావహించాలి. కొన్నిసార్లు మంచు గడ్డ బద్ధలు కావాల్సిందే! అంతిమంగా కర్ణాటక ప్రజలకు మేం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే’ అంటూ అధిష్ఠానం నిర్ణయంపై డీకే స్పందించారు.
పూర్తి సంతోషంగా లేను.. వేచి చూస్తాం!
డీకే శివకుమార్ను అధిష్ఠానం డిప్యూటీ సీఎంగా ప్రకటించడంపై ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నేను పూర్తి సంతోషంగా లేను. భవిష్యత్తులో మాకు అవకాశం ఉండొచ్చు, ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. సీఎం పోస్టు కోసం మేమింకా కొంత కాలం వేచి చూస్తాం.’ అని ఆయన అన్నారు.
అర్థం చేసుకోకుంటే ఇబ్బందులు తప్పవు!
Parameshwara
అధిష్ఠానం కర్ణాటకలో దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవని దళిత నేత, మాజీ డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర హెచ్చరించారు. కొత్త సీఎం, డిప్యూటీ సీఎంల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన కొన్ని గంటలకే ఆయన ఈ విధంగా స్పందించారు. తానొక్కడినే డిప్యూటీ సీఎంగా ఉండాలని శివకుమార్ అధిష్ఠానానికి నిబంధన విధించారన్న వార్తలపైనా పరమేశ్వర స్పందించారు. ‘ఆయన కోణంలో అది సరైందే కావచ్చు. కానీ హైకమాండ్ దృష్టి కోణం విభిన్నంగా ఉండాలి. డిప్యూటీ సీఎం పోస్టుపై దళిత వర్గం ఎన్నో ఆశలు పెట్టుకుందన్న విషయాన్ని గుర్తించాలి. వారికి న్యాయం చేశామా లేదా అనే విషయాన్ని ఆలోచించాలి’ అని ఆయన అన్నారు. దళితుల ఆకాంక్షలను అర్థం చేసుకోలేకపోతే సహజంగానే దానికి తగిన విధంగా ప్రతిస్పందన ఉంటుందని, దీని గురించి అధిష్ఠానానికి చెప్పాల్సిన బాధ్యత తనకుందని ఆయన తెలిపారు. తాను సీఎం, డిప్యూటీ సీఎం పోస్టులకు పోటీ పడుతున్నట్టు పరమేశ్వర ఇంతకు ముందే ప్రకటించారు.