న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాకు ఐదు రోజుల్లో నార్కో టెస్టు నిర్వహించాలని ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రోహిణి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు ఆదేశాలు జారీచేసింది. ఈ ఏడాది మే 18న ఢిల్లీలోని మెహ్రైలీలో శ్రద్ధ వాకర్ హత్యకు గురైంది. నిందితుడు ఆఫ్తాబ్ ఆమె శరీరాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్లో దాచాడు. ఆ తర్వాత ఒక్కో ముక్క బయటపడేస్తూ వచ్చాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఆరు నెలల క్రితం నాటి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కాగా, గంజాయి మత్తులోనే తాను శ్రద్ధ వాకర్ను హత్య చేశానని నిందితుడు ఆఫ్తాబ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. తను తరచూ గంజాయి తాగుతుండటంతో శ్రద్ధ తనతో గొడవపడేదని, ఈ క్రమంలో ఈ ఏడాది మే 18న కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిపాడు. గొడవ అనంతరం తాను మరోసారి బయటకు వెళ్లి గంజాయి తాగి వచ్చానని, ఆ మత్తులో ఆమెను గొంతు నులిమి చంపేశానని చెప్పాడు.
శ్రద్ధ హత్యకు తాను ఎలాంటి ప్లాన్ చేయలేదని, అనుకోకుండా జరిగిందని నిందితుడు పేర్కొన్నాడు. హత్య అనంతరం కేసు నుంచి బయటపడేందుకు ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి.. రోజూ వేర్వేరు ప్రదేశాల్లో పడేస్తూ వచ్చానని చెప్పాడు. కాగా, మృతురాలి పేరెంట్స్ మిస్సింగ్ కేసు పెట్టడంతో.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆఫ్తాబ్ను నిందితుడిగా గుర్తించి తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు.