న్యూఢిల్లీ: తుపాకీ మోతలతో ఢిల్లీ న్యాయస్థానం దద్దరిల్లింది. కోర్టు రూమ్లోనే రక్తం ఏరులై పారింది. తీర్పునిచ్చే జడ్జి ముందే .. గ్యాంగ్వార్ పడగ విప్పింది. కోర్టుకు వచ్చిన గ్యాంగ్స్టర్ను చంపేందుకు అతని ప్రత్యర్థులు మారువేషాల్లో వచ్చి తమ పగతీర్చుకున్నారు. కానీ ఆ రక్తపాతంలో కాల్పులకు తెగించిన మరో ముగ్గురు పోలీసుల తూటాలకు బలయ్యారు. కోర్టుకు వచ్చినవారంతా ఆ కాల్పుల హోరులో అటూ ఇటూ పరుగులు తీశారు. 30 నుంచి 40 రౌండ్ల కాల్పుల శబ్ధాలు వినిపించాయి.రూమ్లన్నీ బుల్లెట్లతో నిండిపోయాయి. కోర్టు రూమ్లో విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఇవాళ షూటౌట్ జరిగింది. గ్యాంగ్స్టర్ జితేంద్ర మాన్ గోగిని అతని ప్రత్యర్థులు కాల్చి చంపారు. అయితే అతనిపై దాడి చేసిన ముగ్గుర్ని పోలీసులు హతమార్చారు. కాల్పుల ఘటనంతా కోర్టు రూమ్ల్లో జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఇదే..
#WATCH | Visuals of the shootout at Delhi's Rohini court today
— ANI (@ANI) September 24, 2021
As per Delhi Police, assailants opened fire at gangster Jitender Mann 'Gogi', who has died. Three attackers have also been shot dead by police. pic.twitter.com/dYgRjQGW7J
అడ్వకేట్ దుస్తుల్లో వచ్చి..
చాలా కేసుల్లో శిక్షను అనుభవిస్తూ జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ జితేంద్ర గోగి.. కటకటాల నుంచే మాఫియాను ఆపరేట్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవాళ రోహిణి కోర్టులో ప్రత్యర్థులే అతన్ని కాల్చి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. అడ్వకేట్ దుస్తుల్లో వచ్చిన ఇద్దరు దుండగులు.. కోర్టురూమ్లో గోగిపై ఫైరింగ్ జరిపారు. ఆ వెంటనే పోలీసులు కూడా ఫైరింగ్ చేసినట్లు రోహిణి డీసీపీ ప్రణవ్ తయాల్ తెలిపారు. టిల్లు గ్యాంగ్కు చెందిన హంతకులను పోలీసులు చంపేసినట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్థానా తెలిపారు. అదేమీ గ్యాంగ్ వార్ కాదు అని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్కు చెందిన పోలీసులు ఏప్రిల్లో గోగిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గోగిపై 19 మర్డర్ కేసులను నమోదు చేశారు. వీటితో పాటు డజన్ల సంఖ్యలో బెదిరింపులు, దొంగతనాలు, చోరీలు ఉన్నాయి. కార్లు కూడా ఎత్తుకువెళ్లిన కేసులు అతనిపై ఉన్నాయి.
గోగి వయసు 30 ఏళ్లు. స్కూల్ డ్రాపౌట్ అయిన అతను ప్రాపర్టీ వ్యవహారాలను చూసుకుంటున్నాడు. 2010లో తండ్రి మరణించిన తర్వాత అతను నేరస్థుడిగా మారాడు. 2010 సెప్టెంబర్లో ప్రవీణ్ అనే వ్యక్తిని గోగి చంపేశాడు. ఆ తర్వాత ఎన్నికల వేళ ఓ కాలేజీలో సందీప్, రవీందర్ అనే ఇద్దర్ని హతమార్చాడు. 2011లో అతన్ని అరెస్టు చేశారు. ఓ గ్యాంగ్ను ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడినట్లు 2018లో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.