భోపాల్: మహా శివరాత్రి సందర్భంగా రెండు వర్గాల ప్రజల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కోట్లాటలో 14 మంది గాయపడ్డారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఖార్గోన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సనావాడ్ ప్రాంతంలోని ఛప్రా గ్రామంలో ఒక శివాలయం ఉంది. శనివారం మహా శివరాత్రి నేపథ్యంలో ఆ ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేసేందుకు దళిత వర్గానికి చెందిన యువతులు ప్రయత్నించారు. దీనిని గమనించిన ఉన్నత వర్గానికి చెందిన ప్రజలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఇది ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. ఈ సంఘటనలో 14 మంది గాయపడ్డారు.
మరోవైపు ఈ ఘర్షణపై ఇరు వర్గాల ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్జార్ వర్గానికి చెందిన భయ్యా లాల్ పటేల్ నేతృత్వంలోని కొందరు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా దళిత బాలికలను అడ్డుకున్నారని ఆ వర్గానికి చెందిన ప్రేమ్లాల్ ఆరోపించాడు. దీంతో 17 మంది అనుమానితులు, 25 మంది గుర్తు తెలియని వ్యక్తులపై అల్లర్లు, ఎస్సీ ఎస్టీ చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే తమపై ఆయుధాలతో దాడిచేసినట్లు రవీంద్రరావు మరాఠా ఫిర్యాదు చేయడంతో ప్రేమ్లాల్తో పాటు మరో 33 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, పొరుగున ఉన్న కస్రావాడ్ ప్రాంతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. చోటీ కస్రావాడ్ గ్రామంలోని శివాలయంలో అభిషేకం చేయకుండా తనను అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదుగురు మహిళలు తనను కులం పేరుతో దూషించారని ఆమె ఆరోపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.