భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్నాథ్ (Kamal Nath) చురకలు వేశారు. ఆయన మంచి నటుడని, ఎన్నికల్లో ఓడినప్పటికీ నటుడిగా రాణిస్తారంటూ ఎద్దేవా చేశారు. సాగర్ జిల్లాలోని రెహ్లీ అసెంబ్లీ స్థానంలో జరిగిన బహిరంగ ర్యాలీలో కమల్నాథ్ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పోలీసులు, డబ్బు, పాలనా యంత్రాంగంపై ఆధారపడుతున్నదని ఆరోపించారు. ఈ నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని అన్నారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు మధ్యప్రదేశ్ ప్రజలు వీడ్కోలు పలుకుతారని కమల్ నాథ్ జోస్యం చెప్పారు. ఆయన తిరిగి సీఎం కాకపోయినా ఖాళీగా ఉండబోరని అన్నారు. ‘శివరాజ్ సింగ్ మంచి నటుడు. నటనా వృత్తిని కొనసాగించడానికి, మధ్యప్రదేశ్కు కీర్తిని తీసుకురావడానికి ముంబైకి వెళ్తారు’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు మధ్యప్రదేశ్లో ఈ నెల 17న ఒకే విడుతలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.