ముంబై, జూలై 4: ఎన్సీపీలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు శరద్ పవార్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్టు పార్టీ వర్గాలు మంగళవారం ప్రకటించాయి. అజిత్ పవార్ వర్గంలో చేరిన ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు చేపట్టేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు తెలిపాయి. ఈనేపథ్యంలో అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నన్ను..నా సిద్ధాంతాల్ని మోసం చేసినవారు నా ఫొటోను వాడొద్దు’ అంటూ శరద్ పవార్ వ్యాఖ్యానించారు. అజిత్ వర్గం మంగళవారం ముంబయిలో తెరచిన పార్టీ కొత్త కార్యాలయంలో శరద్ పవార్ ఫొటో ఉండటం గమనార్హం. ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మహా వికాస్ అఘాడీ సర్కార్ కుప్పకూలాక, షిండే-బీజేపీ సర్కార్తో చేరుదామని 51మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ ముందు చెప్పినట్టు తాజాగా వెల్లడించారు.
షిండే వర్గం అనర్హత త్వరగా తేలేలా చూడండి
ముంబై, జూలై 4: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మరికొందరు రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని అసెంబ్లీ స్పీకర్ త్వరగా తేల్చేలా సుప్రీంకోర్టు ఆదేశాలివ్వాలని శివసేన(యూబీటీ) వర్గం మరోసారి మంగళవారం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సమంజసమైన కాల వ్యవధిలో షిండే వర్గం ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలన్న మే 11 నాటి సుప్రీంకోర్టు ఆదేశాన్ని అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ కావాలనే ఆలస్యం చేస్తున్నారని పిటిషన్ వేసిన యూబీటీ వర్గం ఎమ్మెల్యే సునీల్ ప్రభు కోర్టు దృష్టికి తెచ్చారు.
బీజేపీ సీరియల్ కిల్లర్.. రేపిస్ట్: రౌత్
రాజకీయాల్లో బీజేపీ సీరియల్ కిల్లర్, రేపిస్ట్ అని శివసేన(యూబీటీ) వర్గం ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం తీవ్ర విమర్శలు చేశారు. క్లిష్ట సమయంలో మహా వికాస్ అఘాడీ ఐక్యంగా ఉంటుందని తెలిపారు. యూసీసీ, లోక్సభ ఎన్నికలపై తమ పార్టీ ఆఫీస్ బేరర్లు అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించారని తెలిపారు.