Maharashtra : వారంతా పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలు. గుర్రాలు ఎక్కి, బ్యాండు మేళాతో బయలుదేరారు. వాళ్లని చూసినవాళ్లంతా పెళ్లి మండపానికి వెళ్తున్నారని అనుకున్నారు. కానీ వాళ్లంతా నేరుగా కలెక్టర్ ఆఫీసుకు వెళ్లారు. రాష్ట్రంలో స్త్రీ, పురుష లింగ నిష్పత్తి తగ్గడం పట్ల నిరసన తెలియజేయడం కోసం వాళ్లు ఇలా చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్లు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు తమకు అమ్మాయిని వెతికి పెట్టండని కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. దాంతో వీళ్ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జ్యోతి క్రాంతి పరిషత్ అనే సంస్థ నిర్వహించిన ఈ ర్యాలీలో దాదాపు 50 మంది అబ్బాయిలు పాల్గొన్నారు. ‘నాకు 29 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. మాది సోలాపూర్లోని మారుమూల గ్రామం. మా కుటుంబానికి పాల వ్యాపారం ఉంది. రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తాం. 25 సంబంధాల వరకు చూశాను. అయితే.. ప్రతిసారి అమ్మాయిలు అడిగే మొదటి ప్రశ్న.. ‘మీరు పట్టణంలో నివసిస్తారా? ఉద్యోగం ఉందా? లేదా?’ అని ఈ ర్యాలీలో పాల్గొన్న శిల్వంత్ క్షీర్సాగర్ అనే యువకుడు చెప్పాడు.
‘పెళ్లీడు వచ్చినా పిల్ల దొరక్క చాలామంది అబ్బాయిలు బ్యాచిలర్గానే ఉంటున్నారు. అందుకు కారణం.. ఆడా-మగ నిష్పత్తి తక్కువ ఉండడమే. ఆడపిల్లల్ని గర్భంలోనే చంపేస్తున్నారు. లింగ నిష్పత్తి తగ్గిపోవడానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి’ అని జ్యోతి క్రాంతి పరిషత్ స్థాపకుడు రమేష్ బరస్కర్ తెలిపాడు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ప్రకారం మహారాష్ట్రలో స్త్రీ, పురుష నిష్పత్తి 920ః1000గా ఉంది.