లక్నో: ఉత్తరప్రదేశ్లోని అధికార బీజేపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడటంపై మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ స్పందించారు. ఆ ఎమ్మెల్యేలు బీజేపీని వీడటానికి అనేక కారణాలు ఉన్నాయని మీడియాతో చెప్పారు. కొందరు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారని ఆరోపించారు. మరి కొందరు తమకు నచ్చిన నియోజకవర్గం నుంచి టికెట్ రాదని భయపడుతున్నారని అన్నారు. వీరంతా ఈ ఐదేండ్లు బీజేపీ వెంటే ఉండి పార్టీ కోసం పని చేశారని గుర్తు చేశారు.
రాష్ట్రంలోని బీసీలు, దళితులను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి సిద్ధార్థ్ నాథ్ విమర్శించారు. ఎస్పీ హయాంలో బీసీలు, దళితులకు అమలు చేసిన పది సంక్షేమ పథకాలను ఆ పార్టీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎస్పీ కేవలం ముస్లింలు, యాదవుల కోసం మాత్రమే పనిచేస్తుందని ఆయన ఆరోపించారు.