న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఏడేండ్ల బాలుడి చెంపలపై అతడి మేనబావ సిగరెట్తో కాల్చాడు. రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్లో టీచర్ గమనించి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. దాంతో బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ ఢిల్లీలోని నెబ్సారీ ఏరియాలో 2022, డిసెంబర్ 29న ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బాధిత బాలుడి తల్లిదండ్రుల మధ్య విభేదాలు తలెత్తడంతో వారు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు వేశారు. కోర్టు ఆదేశాల మేరకు బాలుడు మూడు నెలలు తల్లి దగ్గర, మరో మూడు నెలలు తండ్రి దగ్గర ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తండ్రి దగ్గర ఉన్న సమయంలో అతని మేనత్త కుమారుడైన 26 ఏండ్ల యువకుడు బాలుడి చెంపలపై సిగరెట్తో కాల్చాడు. తండ్రి, మేనత్త బాలుడి గాయాన్ని చూసినా అరెస్ట్ భయంతో విషయం బయటికి పొక్కకుండా చూసుకున్నారు.
అయితే, ఈ నెల 27న బాలుడు గాయాలను పరిశీలించి చూసిన టీచర్ ఏమైందని ఆరా తీసింది. అందుకు ఆ బాలుడు జరిగిన విషయం చెప్పాడు. దాంతో టీచర్ ఆ విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. వాళ్లు పేరెంట్స్ను పిలిపించి మాట్లాడారు. దాంతో బాలుడి తల్లికి జరిగిన విషయం తెలిసింది. వెంటనే తన కుమారుడితో కలిసి పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు బాలుడి మేరబావను పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం ఘటనపై విచారణ జరిపిన కోర్టు.. తదుపరి తీర్పు వెలువడే వరకు బాలుడు తల్లి సంరక్షణలోనే ఉండాలంటూ తీర్పునిచ్చింది. ఇప్పటికే భార్యాభర్తల నడుము విడాకుల కేసు నడుస్తుండటం, ఇంతలో భర్త అక్క కొడుకు బాలుడిని సిగరెట్తో కాల్చడం బాలుడి పేరెంట్స్ మధ్య దూరాన్ని మరింత పెంచింది. వాళ్లు మనుసు మార్చుకుని కలిసి ఉండే అవకాశాలు సన్నగిల్లాయి.