పుణె : మహారాష్ట్రలోని పుణెలో ఉన్న సీరం సంస్థ.. కోవీషీల్డ్ కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈనెలలో సుమారు 11.1 కోట్ల టీకాలను ఉత్పత్తి చేయనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ప్రొడక్షన్ వేగాన్ని పెంచినట్లు ఇవాళ ఆ సంస్థ ప్రకటించింది. మరో వైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ టీకాల కొరత ఉన్న విషయం తెలిసిందే. జూలై నాటికి పది కోట్ల టీకాలు ఉత్పత్తి చేస్తామన్న టార్గెట్ను అందుకున్నట్లు ఓ మీడియా సంస్థతో సీరం సంస్థ వెల్లడించింది. ఢిల్లీలో కోవీషీల్డ్ టీకాలకు తీవ్ర కొరత ఉన్నది. స్టాక్లు లేకపోవడం వల్ల ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేశారు. కోవిన్ పోర్టల్ ప్రకారం జూన్ 21 నుంచి జూన్ 27వ తేదీన మధ్య దేశంలో సగటున రోజూ 61.14 లక్షల డోసుల టీకాలను ఇచ్చారు. జూలై 28 నుంచి జూలై 4వ తేదీ వరకు 41.92 లక్షల మంది, జూలై 5 నుంచి 11 వరకు 34.32 లక్షల మంది సగటను ప్రతి రోజూ టీకాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.