న్యూఢిల్లీ, అక్టోబర్ 25: భారత్లో కొవిషీల్డ్ టీకా రెగ్యులర్ మార్కెటింగ్కు అనుమతి ఇవ్వాలని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) దరఖాస్తు చేసుకున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. భారత్తో పాటు పలు ఇతర దేశాలకు 100 కోట్ల కొవిషీల్డ్ డోసులను సరఫరా చేయడాన్ని ఎస్ఐఐ తన దరఖాస్తులో ప్రముఖంగా ప్రస్తావించింది. కొవిషీల్డ్ను పుణెకు చెందిన ఎస్ఐఐ తయారుచేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని కరోనా వ్యాక్సిన్ తయారీదారులతో ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల కిందట సమావేశం నిర్వహించిన నేపథ్యంలో భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ (డీసీజీఐ)కు ఎస్ఐఐ దరఖాస్తు చేసుకున్నది. ప్రస్తుతం కొవిషీల్డ్ అత్యవసర వినియోగానికి భారత్లో అనుమతి ఉంది. దానికి రెగ్యులర్ మార్కెటింగ్కు గ్రీన్సిగ్నల్ లభిస్తే ప్రపంచంలో అలాంటి ఆమోదం పొందిన రెండో వ్యాక్సిన్ అవుతుంది. ఫైజర్-బయోఎన్టెక్కు చెందిన కరోనా టీకాకు ఇప్పటికే అమెరికా ఎఫ్డీఏ నుంచి పూర్తిస్థాయి అనుమతి లభించింది. కాగా, భారత్లో ఇప్పటి వరకు 102.27 కోట్లకు పైగా డోసుల టీకా పంపిణీ జరిగింది. వీటిలో సుమారు 90 శాతం కొవిషీల్డ్. భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ దాదాపు 10 శాతం వరకు, స్పుత్నిక్ వీ ఒక శాతం వరకు ఉంటాయి. భారీస్థాయిలో వ్యాక్సినేషన్కు కొవిషీల్డ్ను ఉపయోగించడమే అది సురక్షితమైనదని, సమర్థవంతమైనదనడానికి ధ్రువీకరణ అని ఎస్ఐఐ పేర్కొన్నట్టు తెలిసింది.