న్యూఢిల్లీ, జూలై 25: రాజకీయాలు వీడాలని తనకు తరుచూ అనిపిస్తున్నదంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో రాజకీయాలంటే అధికారం కోసమే అన్నట్లుగా మారాయని, వీటికంటే జీవితంలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. నాగ్పూర్లో శనివారం జరిగిన సామాజిక కార్యకర్త గిరీశ్ గాంధీ సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ.. గతంలో సామాజిక ఉద్యమంలో భాగంగా రాజకీయాలు ఉండేవని, సమాజం, దేశంలో మార్పు, అభివృద్ధిపై దృష్టిపెడుతూ సాగేవని తెలిపారు. ప్రస్తుత రాజకీయాలు అధికారంమే లక్ష్యంగా కొనసాగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాలంటే ఏంటి? దేశం, సమాజ సంక్షేమం కోసం చేసేవా? లేక ప్రభుత్వంలో ఉండటానికి చేసేవా? అని ప్రశ్నించారు. ‘నాకు చాలాసార్లు రాజకీయాలు వదిలి వెళ్లిపోవాలని అనిపిస్తుంది. సమాజం కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి’ అన్నారు.