కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంలోని అధికార బీజేపీపై మరోసారి మండిపడ్డారు. మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నడాన్ని విమర్శించారు. వరదలతో సతమతమవుతున్న అస్సాంకు మహారాష్ట్ర ఎమ్మెల్యేలను ఎందుకు పంపారని ప్రశ్నించారు. ‘మహారాష్ట్ర ఎమ్మెల్యేలను బెంగాల్కు పంపండి. వారికి మంచి ఆతిథ్యం ఇస్తాం’ అని వ్యాఖ్యానించారు. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే నేతృతంలో తిరుబాటు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు గౌహతిలో బస చేసిన రాడిసన్ బ్లూ హోటల్ వద్ద టీఎంసీ కార్యకర్తలు గురువారం నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ మేరకు స్పందించారు. ‘బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బుల్డోజర్తో కూల్చివేసింది. ఇది నాకు చాలా బాధగా అనిపించింది. బీజేపీ ప్రభుత్వం సమాఖ్య నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేయడం దురదృష్టకరం’ అని అన్నారు.
మరోవైపు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా బీజేపీ తీరుపై మండిపడ్డారు. ఒకవైపు వరదలతో అస్సాం ప్రజలు ఇబ్బంది పడుతుంటే, మరోవైపు సీఎం హిమంత బిస్వా ఢిల్లీ నుంచే వచ్చే ఆదేశాలను అమలు చేయడంలో, శివసేన రెబల్ ఎమ్మెల్యేకు ఆతిథ్యం ఇవ్వడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వం పడిపోవడంపై తక్కువ దృష్టి సారించి వరద బాధిత ప్రజలకు సహాయంపై ఎక్కువ దృష్టి పెట్టాలంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు గురువారం ఒక ట్వీట్ చేశారు. అస్సాంలోని వరద ప్రభావిత ప్రాంతాల ఫొటోలను పోస్ట్ చేశారు.
As ASSAM DROWNS, @BJP4Assam Govt is busy following orders from Delhi to play HOST to REBEL MLAs.
I wish CM @himantabiswa cared more about the flood-affected victims and less about toppling the Maharashtra Govt.
PRIORITIES are clear for a REMOTE CONTROLLED SUBSERVIENT Govt. https://t.co/U3ETOnBWSP
— Abhishek Banerjee (@abhishekaitc) June 23, 2022