(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సెమీ-హైస్పీడ్ ‘వందే భారత్’ రైళ్లు ఆరంభ శూరత్వంగానే మిగిలిపోతున్నాయి. మిగతా సూపర్ ఫాస్ట్ రైళ్లకన్నా ముందే గమ్యం చేరుస్తాయని ప్రారంభించినా.. నిర్వహణ లోపాలతో అభాసుపాలవుతున్నాయి. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయని గప్పాలు కొట్టినా, అత్యధిక టికెట్టు ధరతో కూడిన ఈ రైళ్ల వేగం సగటున గంటకు 75 కిలోమీటర్ల కంటే మించటం లేదు. ప్రస్తుతం వందే భారత్ రైళ్ల వేగం సూపర్ ఫాస్ట్ రైళ్ల వేగం కంటే ఏమంత ఎక్కువగా లేదు. ఇందుకు రైల్వే అధికారులు పొంతన లేని కారణాలు చెప్తున్నారు.
న్యూఢిల్లీ-వారణాసి మధ్య ప్రారంభించిన మొదటి వందేభారత్ రైలు గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందని అధికారులు చెప్పగా.. దాని సగటు వేగం ఇప్పుడు 95 కిలోమీటర్లుగానే ఉన్నది. ఇటీవల చెన్నై- మైసూరు మధ్య ప్రారంభించిన వందేభారత్ రైలు వేగం సగటున గంటకు 75 నుంచి 78 కిలోమీటర్లు కూడా దాటట్లేదు. చెన్నై-బెంగళూరు మధ్య నడిచే శతాబ్ది సూపర్ ఫాస్ట్ రైలు కంటే వందేభారత్ రైలు కేవలం 10 నిమిషాలే ముందు చేరుకొంటున్నదని అందులో ప్రయాణించినవారు వాపోతున్నారు. ఇటీవల వందే భారత్ రైలు పశువులను ఢీకొని మార్గమధ్యమంలోనే నిలిచిపోవడం లాంటి ఘటనలతో వాటి నిర్వహణపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.