Security breach | లోక్సభ (Lok Sabha)లో భద్రతా వైఫల్యం (Security breach) బయటపడింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇద్దరు ఆగంతకులు సభలోకి ప్రవేశించారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఆగంతకులు సభలో టియర్ గ్యాస్ ప్రయోగించారు. వారి షూ నుంచి పసుపు రంగు గ్యాస్ వెలువడింది. జీరో అవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనలో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఎంపీలు సభనుంచి బయటకు పరుగులు తీశారు. అనూహ్య పరిణామంతో సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నీలం, అమోల్ షిండేగా గుర్తించారు. కాగా, పార్లమెంట్ భవనంపై ఉగ్రదాడి జరిగి నేటికి 22 ఏళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో సభలోకి ఆగంతకులు ప్రవేశించడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
#WATCH | Delhi: Two protestors, a man and a woman have been detained by Police in front of Transport Bhawan who were protesting with colour smoke. The incident took place outside the Parliament: Delhi Police pic.twitter.com/EZAdULMliz
— ANI (@ANI) December 13, 2023
కాగా, ఇటీవలే ఖలిస్థాన్ ఉగ్రవాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈనెల 13లోగా పార్లమెంట్పై దాడి చేస్తామంటూ ఈనెల 6వ తారీఖున హెచ్చరించాడు (Will attack Parliament). ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. ‘ఢిల్లీ బనేగా ఖలిస్థాన్’ (ఢిల్లీ ఖలిస్థాన్గా మారబోతోంది) అనే శీర్షికతో వీడియో రిలీజ్ చేశాడు. ఈనెల 13వ తేదీ లేదా అంతకంటే ముందే భారత పార్లమెంట్పై దాడి చేస్తామని బెదిరించాడు. 2001 పార్లమెంట్ దాడి దోషి అఫ్జల్ గురు పోస్టర్ను కూడా అందులో ప్రదర్శించాడు. ఈ వీడియోలో తనని చంపేందుకు భారత ఏజెన్సీలు చేసిన కుట్ర విఫలమైందని అన్నారు. కాగా, డిసెంబర్ 13వ తేదీకి పార్లమెంట్ భవనంపై ఉగ్రవాదులు దాడి జరిపి 22 ఏళ్లు నిండనుంది. 2001 డిసెంబ్ 13వ తేదీకి ఢిల్లీలోని పార్లమెంట్ భవనంపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.
పన్నూన్ హెచ్చరికల నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకోవడం ఉగ్రకుట్రలో భాగమని అధికారులు భావిస్తున్నారు. అనూహ్య పరిణామంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్ ఆవరణలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఆగంతకులు పార్లమెంట్ ఆవరణలో నక్కి ఉన్నారామో అన్న అనుమానంతో అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.