న్యూఢిల్లీ: 657 కోట్ల బ్యాంక్ స్కామ్(Bank Scam) కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఓ ఐఏఎస్ ఆఫీసర్ను అరెస్టు చేసింది. 2000 సంవత్సరం బ్యాచ్కు చెందిన ఐఏఎస్ పంకజ్ అగర్వాల్ను సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అరెస్టు అయిన రెండో ఐఏఎస్ అధికారి ఆయన. ఇదే కేసులో ఇప్పటికే రామ్ కుమార్ సింగ్ అనే ఐఏఎస్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అధికారులు, ప్రభుత్వ అధికారులతో కలిసి ఓ స్కామ్ చేశారు. హర్యానా ప్రభుత్వానికి చెందిన 8 శాఖల నుంచి, చండీఘడ్ పరిపాలన శాఖకు చెందిన రెండు అకౌంట్ల నుంచి నిధులను మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంక్ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో నష్టం 657 కోట్లు ఉంటుందని సీబీఐ పేర్కొన్నది. అయితే ఇదే కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారిస్తున్నది. సుమారు 645 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఈడీ చెబుతోంది.
స్కామ్ జరిగిన సమయంలో అడ్మినిస్ట్రేట్ సెక్రటరీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్పేర్ డిపార్ట్మెంట్కు పంకజ్ అగర్వాల్ పనిచేశారు. హర్యానా వ్యవసాయ మార్కెటింగ్ బోర్డుకు సంబంధించిన సుమారు 10 కోట్లు.. చండీఘడ్లోని ఐడీఎఫ్ ఫస్ట్ బ్యాంక్ నుంచి మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అగ్రికల్చర్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో అకౌంట్ను మెయిన్టేన్ చేసినట్లు తెలుస్తోంది. ఎస్ఆర్ఆర్ ప్లానింగ్ గురుస్ లిమిటెడ్ సంస్థకు 9.75 కోట్లు, మన్నత్ కాంట్రాక్టర్స్కు 25 లక్షలు చెల్లించారు. కానీ షెల్ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంక్ కుంభకోణంలో మొత్తం 8 మంది ఐఏఎస్ ఆఫీసర్లపై నిఘా పెట్టారు. దీంట్లో ఇద్దర్ని అరెస్టు చేశారు. మొహమ్మద్ షాయిన్, మణి రామ్ శర్మ, ప్రదీప్ కుమార్, వినీత్ గార్డ్, సాకేత్ కుమార్, డీకే బెహరా ఉన్నారు.
హర్యానా స్కూల్ శిక్షా పరియోజనా పరిషద్కు సెక్రటరీగా ఉన్న సమయంలో విద్యాశాఖ అకౌంట్ నుంచి సుమారు 50 కోట్లు దారి మళ్లించినట్లు పంకజ్ అగర్వాల్పై ఆరోపణ ఉన్నది. ఫైనాన్స్ శాఖ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా అకౌంట్లను ఓపెన్ చేసి నిధులను మళ్లించినట్లు పంకజ్పై ఆరోపణలు ఉన్నాయి.