పాట్నా: భారత్లో ప్రవాస జీవితం గడుపుతున్న టిబెట్కు చెందిన ఆధ్యాత్మిక, రాజకీయ గురువు దలైలామా బీహార్లోని బుద్ధగయను గురువారం సందర్శించారు. ఉదయం ‘కాల చక్ర’ మైదానంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. కరోనా నేపథ్యంలో మూడేళ్ల తర్వాత జరుగుతున్న వార్షిక పర్యటనలో భాగంగా ఈ నెల 31 వరకు మూడు రోజుల పాటు ఆధ్మాత్మిక బోధనలు అందజేస్తారు.
కాగా, బుద్ధగయకు దలైలామా రాక సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే గత రెండేళ్లుగా అనాధికారికంగా అక్కడ నివసిస్తున్న చైనా మహిళ సాంగ్ జియోలాన్ గురించి పోలీసులు వెతుకుతున్నారు. స్పైగా అనుమానిస్తున్న ఆ చైనా మహిళ స్కెచ్, వీసా, పాస్పోర్ట్ వివరాలను మీడియాకు విడుదల చేశారు.
మరోవైపు చైనా మహిళ సాంగ్ జియోలాన్ గత రెండేళ్లుగా గయలో ఉంటున్నట్లు తమకు తెలిసిందని పోలీస్ అధికారిణి హర్ప్రీత్ కౌర్ తెలిపారు. అయితే దలైలామా గయ సందర్శన సందర్భంగా ఆ మహిళ గురించి వెతకగా ఆమె ఆచూకీ లభించలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాలను అలెర్ట్ చేయడంతోపాటు ఆ చైనా మహిళ కోసం అన్ని చోట్ల సోదాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆమె గత ఏడాదిగా గయతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో నివసించినట్లు తెలిపారు. అయితే విదేశీ విభాగం రికార్డుల్లో ఆ చైనా మహిళ వివరాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో ఆమె చైనా గూఢచారి అనే అనుమానాన్ని తాము తోసిపుచ్చలేమని అన్నారు.