తిరువనంతపురం: రోడ్డు విస్తరణ కోసం చెట్టును నరికివేయడంతో అనేక పక్షులు మరణించాయి. కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ హృదయవిదారక సంఘటన జరిగింది. తిరురంగడిలోని వీకే పాడిలో జాతీయ రహదారిని విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్టును జేసీబీతో నరికి కూల్చివేశారు. అయితే ఆ చెట్టుపై అనేక పక్షులు గూళ్లు కట్టుకున్నాయి. చాలా పక్షులు గుడ్లు పెట్టి పిల్లలను పొదిగాయి. కాగా, ఆ చెట్టును కూల్చివేయడంతో గూళ్లలోని అనేక పక్షులు ఎగురలేక బలంగా నేలను తాకి చనిపోయాయి. కొన్ని పక్షులు మాత్రమే ఎగిరి ప్రాణాలు దక్కించుకున్నాయి. ఆ చెట్టు మీదున్న పక్షుల గూళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనను చూసిన స్థానికుల మనసు ద్రవించిపోయింది. ఆవేదనతో విలవిలలాడిపోయారు.
మరోవైపు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ ఈ హృదయవిదారక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మనుషుల కూరత్వంపై ఆయన మండిపడ్డారు. ప్రతి జీవికి ఆవాసం కావాలన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. పలు పక్షుల మరణానికి కారణమైన వారిని శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.
కాగా, పర్యావరణవేత్తలు, పక్షుల ప్రేమికులు కూడా ఈ సంఘటనపై స్పందించారు. పక్షులు గుడ్లు పెట్టి పొదిగే కాలం ముగిసేవరకు రోడ్డు విస్తరణ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేరళ అటవీ శాఖ కూడా వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసింది. అయితే ఎలాంటి అనుమతి లేకుండానే ఆ చెట్టును కూల్చినట్లు తెలిసింది. దీంతో జేసీబీ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Everybody need a house. How cruel we can become. Unknown location. pic.twitter.com/vV1dpM1xij
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 2, 2022