Scindia-RPN Singh | కాంగ్రెస్ పార్టీలో తన మిత్రులను బీజేపీ గూటికి తీసుకెళ్లడంలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కీలకంగా వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. ఈ నెల 25న ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఆర్పీఎన్ సింగ్.. కమలం కండువా కప్పుకోవడం వెనుక సింధియా చక్రం తిప్పారని తెలుస్తున్నది. 2 నెలల క్రితమే బీజేపీలోకి ఆర్పీఎన్ సింగ్ను తీసుకొచ్చేందుకు సింధియా స్క్రిప్ట్ సిద్ధం చేశారిన తెలుస్తున్నది. గత రెండు నెలలుగా నిరంతరం ఆర్పీఎన్ సింగ్తో సింధియా చర్చిస్తున్నారని వినికిడి. ఆర్పీఎన్ సింగ్ను జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్చార్జీగా ప్రకటించగానే సరైన టైంగా భావించి బీజేపీలో చేరారని తెలుస్తున్నది. యూపీలోని పూర్వాంచల్ ప్రాంత నేత స్వామి ప్రసాద్ మౌర్య.. రాష్ట్ర మంత్రిగా రాజీనామా చేసి.. సమాజ్వాదీ పార్టీలో చేరగానే ఆర్పీఎన్ సింగ్ కమలదళంలో చేరిపోయారని సమాచారం.
స్వామి ప్రసాద్ మౌర్య తన మంత్రి పదవికి ఈ నెల 12న రాజీనామా చేసిన తర్వాత మూడు దఫాలు కేంద్ర హోంమంత్రి అమిత్షా మూడు దఫాలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని తెలుస్తున్నది. దీంతో ఆర్పీఎన్ సింగ్ను రంగంలోకి తేవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అప్పటికే బీజేపీలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్న ఆర్పీఎన్ సింగ్ను ఆహ్వానించాలని సింధియాకు అమిత్షా సిగ్నల్ ఇచ్చారని ఆయన సన్నిహిత వర్గాల కథనం.
ఆర్పీఎన్ సింగ్తో తొలి నుంచి జ్యోతిరాదిత్య సింధియాకు స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడదోసి బీజేపీ సర్కార్ ఏర్పాటు చేయడంలో సింధియా కీలకంగా వ్యవహరించారు. తర్వాత బీజేపీ ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర క్యాబినెట్లో బెర్త్ కల్పించింది. జార్ఖండ్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు బాధ్యతలను ఆర్పీఎన్ సింగ్కు ఆ పార్టీ అధిష్టానం అప్పగించింది. ఆ వెంటనే బీజేపీలోకి సింగ్ను తేవడానికి సింధియా స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు పరిస్థితిని వివరించారు.