న్యూఢిల్లీ, జూన్ 22: అగ్నిపథ్ను వెంటనే ఉపసంహరించుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) డిమాండ్ చేసింది. ఇది యువతకు ఏ మాత్రం మంచిది కాదని పేర్కొన్నది. అగ్నిపథ్పై శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు ఎస్కేఎం సభ్యుడు, రైతు నేత అభిమన్యు కోహర్ వెల్లడించారు. వివాదాస్పద సాగు చట్టాల రద్దుకు ఎస్కేఎం నేతృత్వంలో ఏడాదికి పైగా ఉద్యమం నడిచిన సంగతి తెలిసిందే. కాగా, కేంద్రప్రభుత్వం సాయుధ బలగాలను బలహీనపరుస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ రాహుల్ గాంధీ విమర్శించారు. చైనా మన భూభాగంలోకి వచ్చి నిర్మాణాలు చేపడుతుంటే సైన్యాన్ని బలోపేతం చేసుకోవాల్సింది పోయి బలహీనపరచడం ఏంటని ప్రశ్నించారు. పైగా కేంద్రంలోని బీజేపీ నాయకులు తమను తాము జాతీయవాదులమని చెప్పుకొంటారని ఎద్దేవా చేశారు. ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ అని చెప్పి ఇప్పుడు సైన్యాన్ని ‘నో ర్యాంక్ నో పెన్షన్’ స్థాయికి తీసుకువస్తున్నారని విమర్శించారు.
బీహార్,జమ్ములో నిరసనలు
అగ్నిపథ్కు వ్యతిరేకంగా బీహార్లో ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. పాట్నాలో అసెంబ్లీ నుంచి రాజ్భవన్కు ర్యాలీ నిర్వహించాయి. నిరసనలకు ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నేతృత్వం వహించారు. గవర్నర్కు మెమో సమర్పించారు. నిరసనకారులపై కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరారు. ‘రక్షణ రంగ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఈ పథకం చాలా కీడు చేస్తుంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం యువత భవిష్యత్తుతో ఆడుకొంటున్నది. కేంద్రం వెంటనే అగ్నిపథ్ను ఉపసంహరించుకోవాలి’ అని తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. అగ్నిపథ్పై సీఎం నితీశ్ కుమార్ మౌనంగా ఉండటం సరికాదన్నారు. అగ్నిపథ్ను ఉపసంహరించుకోవాలని పీడీపీ బుధవారం ఆందోళన కార్యక్రమాలు చేసింది. పీడీపీ కార్యకర్తలు జమ్ములోని గాంధీనగర్లో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి జమ్ము ఎయిర్పోర్టు రోడ్డు వరకు మార్చ్ నిర్వహించారు. పోలీసులు వాళ్లను అడ్డగించారు.