న్యూఢిల్లీ: యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మరణం పట్ల ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. “కల్యాణ్ సింగ్ మరణం మాటల్లో చెప్పలేని దుఃఖం.. కల్యాణ్ సింగ్ జీ రాజనీతిజ్ఞుడు. పేరొందిన కార్యనిర్వాహకుడు. ప్రజా నాయకుడు. గొప్ప మానవతా వాది. ఉత్తరప్రదేశ్ అభివ్రుద్ధిలో ఆయన పాత్ర ఎనలేనిది. ఆయన కుమారుడు రాజ్వీర్ సింగ్తో మాట్లాడాను. కల్యాణ్ సింగ్ మరణం పట్ల సంతాపం తెలుపుతున్నాను.. ఓం శాంతి“ అని ట్వీట్ చేశారు.
భారత సాంస్క్రుతిక పునరుత్తేజంలో ఆయన సేవలు భవిష్యత్ తరాలకు చిరస్మరణీయంగా ఉంటాయి. శతాబ్దాల క్రితం సంప్రదాయాలకు గర్వకారణం. భారతీయ విలువలకు కట్టుబడిన నేత కల్యాణ్ సింగ్ అని అభివర్ణించారు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మరణించిన యూపీ సీఎం కల్యాణ్ సింగ్.. గత నెల 4న లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్జీపీజీఐఎంఎస్) లో చేరారు. నాటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్న కల్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. శుక్రవారం పరిస్థితి మరింత దిగజారడంతో డయాలసిస్ చేశారు.
నేఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రైనాలజీ, న్యూరో ఆటాలజీ విభాగాల వైద్యులతో కూడిన బ్రుందం కల్యాణ్ సింగ్కు చికిత్సనందిస్తూ వచ్చింది. గత నెల 23 నుంచి ఆయన పరిస్థితి విషమిస్తూ వచ్చింది. నాటి నుంచి లైఫ్ సపోర్ట్పై చికిత్స అందించారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీ.. కల్యాణ్ సింగ్ త్వరితగతిన కోలుకోవాలని దేశ ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని ట్వీట్ చేశారు. తొలుత రాం మనోహర్ లోహియా దవాఖానలో చికిత్స పొందిన కల్యాణ్ సింగ్ను తదుపరి ఎస్జీపీజీఐఎంఎస్కు తరలించారు.
1991 జూన్ నుంచి 1992 డిసెంబర్, 1997 సెప్టెంబర్ నుంచి 1999 నవంబర్ వరకు యూపీ సీఎంగా పని చేశారు. సుదీర్ఘ కాలంగా సాగిన బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు స్రుష్టించింది. ఆధునిక భారతంలో సామాజిక-రాజకీయ చరిత్రలో ఈ ఘటన మైలురాయిగా నిలిచింది. తదుపరి బీజేపీ ఎదుగుదలకు కారణమైంది. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత పూర్తి అయిన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే, అదే రోజు యూపీ సర్కార్ను నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న పీవీ నర్సింహారావు సర్కార్ రద్దు చేసింది.