న్యూఢిల్లీ, ఆగస్టు 22: రానున్న కొద్ది నెలల్లో పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు, వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియలో ప్రజలు విస్తృతంగా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ను ‘నేషనల్ ఐకాన్’గా ఎంపిక చేసింది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ), సచిన్ టెండూల్కర్ మధ్య అవగాహన ఒప్పందం కుదరనుంది. మూడేళ్ల పాటు అమలులో ఉండే ఈ ఒప్పందంలో భాగంగా సచిన్ ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిన ఆవశ్యకతపై ప్రచారం చేస్తారు. ఈ ఒప్పందం పట్టణ, నగరాల్లో ఓటింగ్ పట్ల అనాసక్తి చూపే వారిలో ముఖ్యంగా యువతపై ప్రభావం చూపుతుందని ఈసీ పేర్కొన్నది.