మాస్కో : భారత్కు చెందిన ప్రఖ్యాత ఫార్మసీ కంపెనీ పానేసియా బయోటెక్.. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేయనున్నది. హిమాచల్ ప్రదేశ్లోని బడ్డి పట్టణంలో ఉన్న పానేసియా బయోటెక్ కంపెనీ ఉత్పత్తి చేసిన తొలి బ్యాచ్ టీకా ఉత్పత్తులను మొదట రష్యాలోని గమేలియా క్వాలిటీ కంట్రోల్ సెంటర్కు తరలిస్తారు. అయితే ఈ వేసవిలోనే పానేసియా కంపెనీలో పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ల ఉత్పత్తి మొదలవుతుందని రష్యన్ డైరక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ పేర్కొన్నది. స్పుత్నిక్ వీ టీకాలకు ఇండియాలో ఎమర్జెన్సీ అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ టీకాలకు హైదరాబాద్కు చెందిన రెడ్డీస్ ల్యాబ్కు కొన్ని వచ్చాయి. అయితే ఏడాదికి పది కోట్ల డోసులను ఉత్పత్తి చేసేందుకు పానేసియా, ఆర్డీఐఎఫ్ మధ్య ఒప్పందం కుదిరింది.
ప్రపంచ వ్యాప్తంగా 66 దేశాలు స్పుత్నిక్ టీకాలను రిజిస్టర్ చేశాయి. స్పుత్నిక్ టీకా సామర్థ్యం 97.6 శాతంగా ఉంది. గత ఏడాది డిసెంబర్ అయిదో తేదీ నుంచే రష్యాలో స్పుత్నిక్ వీ టీకాలు పంపిణీ సాగింది. మానవులకు సంక్రమించే అడినోవైరల్ వెక్టార్ల ద్వారా స్పుత్నిక్ టీకాలను తయారు చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్తో బాధపడుతున్న భారత్కు.. పానేసియాతో కుదిరిన డీల్ ఊరటనిస్తుందని ఆర్డీఐఎఫ్ సీఈవో కిరిల్ డిమిత్రేవ్ తెలిపారు. ఇదో కీలకమైన అడుగు అని, ఆర్డీఐఎఫ్తో కలిసి స్పుత్నిక్ను ఉత్పత్తి చేస్తామని, దీంతో దేశంలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని పానేసియా బయోటెక్ ఎండీ డాక్టర్ రాజేశ్ జైన్ తెలిపారు.